అర్థరాత్రి బుల్లెట్ చప్పుళ్ళు, వీధి కుక్కల అరుపులతో ఆ గ్రామంలో భయాందోళన పరిస్థితి కనిపించింది. కారులో వచ్చి.. గ్రామంలో అమానుషం సృష్టించారు. వీధుల్లో కనిపించిన ఏ కుక్కను వదలకుండా తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు దుండగులు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో దారుణం జరిగింది. అర్ధారత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వీధికుక్కలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రాత్రి సుమారు2 గం.ల తర్వాత ఒక్కసారిగా గ్రామంలో తుపాకి కాల్చిన శబ్ధం, వీధికుక్కల అరుపులు భయందోళనకు గురిచేశాయి. గుర్తుతెలియన వ్యక్తులు గ్రామంలోకి చోరబడి కనిపించిన వీధికుక్కలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తుపాకీ చప్పుల్లకు గ్రామంలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. తీర ఉదయం లేచి చూసేసరికి వీధికుక్కలపై యుద్ధం జరిగినట్లుగా గ్రామంలో పరిస్థితి కనిపించింది. మొత్తం 30కుక్కలపై కాల్పులు జరుపగా సుమారు 21కుక్కలు మరణించాయి. మరికొన్నింటికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
అర్ధరాత్రి 2 గంటల సమయం దాటిన తర్వాత ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. స్విఫ్ట్ కారులో గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన దుండగులు కనిపించిన ఏ కుక్కను వదలకుండా తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఒక్కో కుక్కను వెంబడించి మరి హతమార్చారు దుండగులు. స్థానికుల సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేవలం కుక్కలను టార్గెట్ చేసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారని తేల్చారు. క్లూస్ టీం, వెటర్నీరి డాక్టర్లు మరణించిన కుక్కలను పరిశీలించారు. కుక్కల శరీరాల్లో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. కాల్పులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు.
వీధికుక్కలపై అమానవీయ దాడి ఘటన మహబూబ్ నగర్ జిల్లాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరూ? కుక్కలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులు ఎవరన్నది అంతుచిక్కడం లేదు. నాటు తుపాకీని ఉపయోగించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాల్పులకు పాల్పడింది నార్త్ కు చెందిన దొంగల ముఠానా ఇంకా ఎవరైనా ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..