Telangana: లోక్ సభ ఎన్నికల వేళ ఉత్కంఠభరిత రాజకీయం.. కారు పార్టీని ఖాళీ చేస్తున్న కాంగ్రెస్, కాషాయం..

రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నదే ఆల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు.. ఆల్ పార్టీస్‌ది ఇదే లెక్కాపత్రం. గెలుపే ముఖ్యం కానీ..ఎలా గెలిస్తే ఏంటి. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. వెంటనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంకేముంది అధికారం లేకపోతే కునుకు పట్టని నేతలంతా క్యూ కట్టారు.

Telangana: లోక్ సభ ఎన్నికల వేళ ఉత్కంఠభరిత రాజకీయం.. కారు పార్టీని ఖాళీ చేస్తున్న కాంగ్రెస్, కాషాయం..
Congress vs BRS

Updated on: Mar 29, 2024 | 9:49 PM

రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నదే ఆల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు.. ఆల్ పార్టీస్‌ది ఇదే లెక్కాపత్రం. గెలుపే ముఖ్యం కానీ..ఎలా గెలిస్తే ఏంటి. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. వెంటనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంకేముంది అధికారం లేకపోతే కునుకు పట్టని నేతలంతా క్యూ కట్టారు. కాంగ్రెస్‌లో విలీనమైపోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న నేతలకు లెక్కాలేదు. గులాబీ బాస్‎కు అత్యంత సన్నిహితులుగా పేరుబడ్డ నాయకులు కూడా గాంధీభవన్‌కు పయనమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరి నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం.. పార్టీ మారే ప్రసక్తే లేదు.. అసలు ఆ అవసరమే లేదు.. అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాళ్లు చేస్తున్న నేతలే.. తెల్లారితే కాంగ్రెస్ కండువానో, కాషాయ కండువానో కప్పుకుని కనిపిస్తూ.. షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన వలసల ప్రవాహం.. మెల్లమెల్లగా ఊపందుకుని.. ఇప్పుడు జోరుగా నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్‌లో కీలకంగా ఉన్న కే.కేశవరావు కూడా బీఆర్ఎస్‌కు బైబై చెప్పారు. ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరనున్నారు. అంతేనా కడియం శ్రీహరి కుటుంబం కూడా కారుదిగింది. బీఆర్ఎస్‌ వరంగల్ ఎంపీ టికెట్ కడియం కూతురు కావ్యకు ఇచ్చినా ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కూతురుతోపాటు తండ్రి కూడా గులాబీకి గుడ్‌బై చెప్పేశారు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇప్పుడు కాంగ్రెస్‌ జట్టులోకి చేరడంతో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతోంది. లోక్‌సభ ఎన్నికల వేళ..ఇది కచ్చితంగా బీఆర్ఎస్‌ను దెబ్బదీసే తంత్రమే. సామాజిక వర్గాల పరంగానూ చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పక్కపార్టీ నేతలను తనలో కలుపుకుంటోంది.

ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. తాను గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని.. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు మాత్రమే మిగులుతారని.. సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారామధ్య. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింటేంటే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో.. బీఆర్ఎస్ నుంచి ఎవరొచ్చినా తీసుకునేది లేదని…ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా గేట్లే ఎత్తేసేశారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా రంగంలో దిగిందని.. పలువురు కీలక బీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్తూ.. వారితో మంతనాలు జరుపుతోందని టాక్ నడుస్తోంది. కొంచెం పాజిటివ్ టాక్ ఉన్నా.. సోషల్ మీడియాలో వాళ్లే లీక్ చేసేసి.. వచ్చే వరకు ప్రచారం గట్టిగా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైతేనేం.. తెలంగాణలో నీటి ఎత్తిపోతల పథకాలు ఎండిపోతున్నా.. నేతల ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం కళకళలాడుతోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. చేరడమే కాదు దానంకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా కేటాయించింది.అంతేకాదు బీఆర్ఎస్‌ బీజేపీతో జట్టు కట్టబోతోందన్న విషయం కూడా టీవీ9బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్ లో రివీల్ చేశారు దానం

ఇవి కూడా చదవండి

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మెజారిటీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్ల్లో నడుస్తున్న టాక్. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్‌రావు తదితరులు కూడా వచ్చే వారంలో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలోకి మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ఎల్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనతో మరో 24 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. అదే జరిగితే గులాబీ పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 2024లో ఎలాగైనా మెజార్టీ ఎంపీ సీట్లను దక్కించుకోవాలన్న కసి మీదున్న కాంగ్రెస్‌, ఆపరేషన్‌ ఆకర్ష్‌ను చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. మెయిన్‌గా కాంగ్రెస్‌ను వదిలివెళ్లిన లీడర్స్‌ను వెనక్కి రప్పించే పనిలో పడింది. ఆపరేషన్‌ స్వగృహ చేపడుతూ మాజీ నేతలపై గురిపెట్టింది. అందులో భాగంగానే కేశవరావు ఇంటికి స్వయంగా సీఎం రేవంత్‌ వెళ్లి చర్చించారు. పార్టీలో చేరేలా చేశారు.ఇది ఆరంభం మాత్రమే ముందుముందు ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారంటున్నారు కాంగ్రెస్ నేతలు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేశానంటున్నారు కేకే. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న రేవంత్‌ మరో 10 రోజుల్లోగా బీఆర్‌ఎస్‌ నుంచి మరికొంత మంది నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు. అంతేకాదు మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ చాలా సెలక్టివ్‌గా నేతలను తీసుకుంటోంది. మాదిగ వర్గానికి ఫేస్గా వరంగల్లో ఉన్న కడియం ఫ్యామిలీని రంగంలోకి దింపబోతోంది. కడియంతో పాటు కడియం కూతురు కావ్య ఇప్పుడు అక్కడ కీలకంగా ఉన్నారు. కావ్య చేరడంతో వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్‌ కాలేదు. అయితే వరంగల్‌ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్‌ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోచేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. పార్టీ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉండడంతోనే బీఆర్ఎస్‌ను వీడామన్నది కడియం చెబుతున్న మాట. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపులే లక్ష్యంగా కేకే, దానం నాగేందర్‌లను రంగంలోకి దింపనుంది. ఇలా బలం ఉండి.. బలగం ఉండి గెలిపించే నాయకులకు గాలం వేస్తోంది.ఆదిలాబాద్లో కొనన్న ఇంద్రకరణ్‌ రెడ్డి. రంగారెడ్డిలో రంజిత్‌రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి , పాలమూరులో జితేందరెడ్డిలను రంగంలోకి దింపింది. చేరుతున్న వారితోనే బీఆర్ఎస్ను బలహీనపరిచేలా కాంగ్రెస్ వ్యూహ రచన చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..