
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రడగంబాల బస్తీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ దుకాణం ముందు పిండి బొమ్మ, పసుపు, కుంకుమతో చేసిన పిండి ముద్దలు, కోడిగుడ్లు పెట్టి పూజలు చేసిన ఘటన కాలనీ వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. శుక్రవారం దుకాణం తెరిచిన యజమానికి షాప్ ముందు క్షుద్ర పూజలు చేసినట్టు కోడిగుడ్డు, ముగ్గులు పెట్టి ఉండడం చూసి హడలెత్తిపోయాడు.
పూజల వ్యవహారంతో అటు దుకాణం యజమాని, ఇటు బస్తీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. క్షుద్రపూజల సమాచారం తెలుసుకున్న స్థానికులు అటువైపు వెళ్లాలంటేనే వణికిపోయారు. గురువారం అమావాస్య కావడం.. పిండి ముద్దతో చేసిన బొమ్మకు సూది గుచ్చి ఉండటం.. నిమ్మకాయ, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ ముద్దలు ప్లేట్లో పెట్టి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు దుకాణ యజమాని. క్షుద్ర పూజల భయంతో యజమాని నాగరాజు 100కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ముగ్గులు వేసి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించి క్షుద్ర పూజలు చేసేవారిని పట్టుకోవాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి