తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అందరి కంటే ముందుగా ప్రచార శంఖాన్ని పూరించగా.. కాంగ్రెస్ ఈమధ్య కాలంలో ప్రచారంలో పుంజుకుంది. ఇక వీరిద్దరికీ ధీటుగా నిలబడేందుకు సిద్దమైంది బీజేపీ. మన్నటి వరకూ కేంద్ర మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇకపై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టే వారి జాబితాను విడుదల చేసింది బీజేపీ. అందులో ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారు.
ఆ తరువాత జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీలు ఉన్నారు. జాతీయ అధ్యక్షులతో పాటూ కేంద్ర మంత్రులు కూడా క్యాంపేయింగ్ చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటూ కేంద్ర మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటూ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ లు పాల్గొననున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కొన్ని బహిరంగ సభలకు హాజరై బీజేపీ నాయకత్వాన్ని తెలంగాణలో బలపరిచేందుకు కృషి చేయనున్నారు. దీంతో ఎన్నికల సందడి ఒక్కసారిగా వేడెక్కింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..