AP vs Telangana: రాజోలి బండపై మళ్ళీ రాజుకుంటున్న రగడ.. అసలు చరిత్ర ఏంటంటే?

రాజోలిబండ.. ఈ మాట తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అనేక మార్లు వింటూ వస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ మాట తరచూ వినిపించడానికి కారణం రాజోలిబండ నీటి పంపకంపై కొనసాగుతున్న వివాదమే కారణం.

AP vs Telangana: రాజోలి బండపై మళ్ళీ రాజుకుంటున్న రగడ.. అసలు చరిత్ర ఏంటంటే?
Rajolibanda Diversion Schme Jagan Kcr
Follow us

|

Updated on: Mar 29, 2021 | 5:45 PM

AP vs Telangana over Rajolibanda Diversion Scheme: రాజోలిబండ.. ఈ మాట తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అనేక మార్లు వింటూ వస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ మాట తరచూ వినిపించడానికి కారణం రాజోలిబండ నీటి పంపకంపై కొనసాగుతున్న వివాదమే. నిజాం రాజుల దూరదృష్టి కారణంగా బ్రిటిష్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌పై అసలు వివాదమెందుకు? అప్పట్లో తొలుత హైదరాబాద్ స్టేట్‌తో చెన్నై ప్రెసిడెన్సీ మధ్య జరిగిన ఒప్పందం.. ఆ తర్వాత ఉమ్మడి ఏపీ, కర్నాటక రాష్ట్రాల మధ్య ఒప్పందంగా మారి.. ఇపుడు ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా కొనసాగుతోంది ఆర్డీఎస్.. రాజోలిబండ డైవెర్షన్ స్కీమ్. అసలు వివాదానికి కారణమేంటి? ఓ సారి చరిత్ర చూద్దాం..

ఆర్‌డిఎస్. అంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. తుంగభద్ర నదిపై కట్టిన ఓ ఆనకట్ట. తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకునేందుకు ఈ డైవర్షన్ స్కీమ్ ఆలోచన చేసింది ఆనాటి నిజాం ప్రభుత్వం. అయితే.. అప్పటి బ్రిటిష్ పరిపాలనలో వున్న చెన్నై ప్రెసిడెన్సీతో ఓ ఒప్పందానికి వస్తే గానీ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నిర్మాణం పూర్తి కాదని భావించిన నిజాం రాజులు.. బ్రిటిష్ వారిని సంప్రదించి.. చెన్నై ప్రెసిడెన్సీతో ఒప్పందం చేసుకుని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ స్టేట్, చెన్నై ప్రెసిడెన్సీలు రాజోలిబండ నీటిని చెరి సమానం పంచుకోవాలన్నది ఒప్పందంలో ముఖ్యమైన పాయింట్. 1944లో పూర్వపు హైదరాబాద్‌ రాజ్యానికి , బ్రిటిష్‌ ఇండియాలో భాగమైన మద్రాస్‌ రాష్ట్రానికి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఆర్‌డిఎస్‌కు దిగువన సుంకేసుల ఆనకట్ట, కె.సి.కెనాల్‌ నిర్మాణాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టింది. ఆర్‌డిఎస్‌ ఆనకట్ట వద్ద ఎడమ వైపున హైదరాబాదు రాష్ట్రానికి ఆర్‌డిఎస్‌ కెనాల్‌ ద్వారా నీరు మళ్లించాలని తలపెట్టారు. నదిలో ఆనకట్ట దిగువన సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్‌కు నీళ్ళు ఇచ్చేలా ఆర్డీఎస్‌ను డిజైన్ చేశారు. రెండు వైపులా సమానంగా నీరు మళ్ళించాలన్న అంగీకారానికి వచ్చారు.

ఆ తర్వాత 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో హైదరాబాద్ స్టేట్ ప్రాంతంలో వున్న మహబూబ్‌నగర్ జిల్లా ఉమ్మడి ఏపీలో భాగమైంది. ఆర్డీఎస్ పరిధిలోనే వున్న రాయచూర్ కర్నాటకలోకి వెళ్ళింది. తుంగభద్ర జలాల వాడకంలో మద్రాస్‌ రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రాలకు బదులు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు చేరాయి. ఆనాటి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. అటు కేసీకేనాల్, ఇటు ఆర్డీఎస్ కాల్వ రెండింటి మేనేజ్‌మెంటు ఉమ్మడి ఏపీ నీటి పారుదల శాఖకు దక్కింది. ఇక్కడే తెలంగాణకు అన్యాయం జరిగిందనేది తెలంగాణ ప్రాంత నాయకులు వాదన. ఈ వాదన అటు తెలంగాణ ఉద్యమకాలంలో వినిపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా అదే అన్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు పెట్టకుండా కేసీ కెనాల్‌‌కు ఎక్కువ నీటి కేటాయింపులు చేస్తున్నరని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వాదన. కాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేసీ కెనాల్‌కు, రాజోలిబండ కాలువకు తుంగభద్ర నీటిలో సమాన వాటా, కేటాయింపులు జరుగుతున్నాయని ఏపీ సర్కార్ చెబుతోంది.

తాజా వివాదమిదే..

ఆర్డీఎస్ నిర్మాణం ప్రతిపాదన వచ్చినపుడు రాయలసీమ (ఆనాడు చెన్నై ప్రెసిడెన్సీలో వుండేది), ఇటు తెలంగాణ (ఆనాడు నిజాం పాలనలో వుండేది) మధ్య తుంగభద్ర జలాలు సమానంగా పంచుకోవాలనేది 1944లో జరిగిన ఒప్పందం. ఈ 1944 ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉల్లంఘించిందని తెలంగాణ పాలకులు ఆరోపిస్తున్నారు. 1970వ దశకంలో, బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు జరిగాయి. ఆర్డీఎస్‌ కాలువకు, కేసీ కెనాల్‌‌కు సమానంగా నీటిని కేటాయించాలని వాదన చాన్నాళ్ళుగా కొనసాగుతోంది. అయితే, ఆర్డీఎస్ ద్వారా కేసీ కెనాల్‌‌కు 69.4 టీఎంసీలు, ఆర్‌డిఎస్‌ కెనాల్‌‌కు 15.9 టీఎంసీలు వినియోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. కేసీ కెనాల్‌‌కు 39.9 టీఎంసీలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు 15.9 టీఎంసీలు, రాయచూర్‌ జిల్లాకు 1.2 టిఎంసిల కేటాయింపులు చేస్తూ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. చెరి సమానంగా తుంగభద్ర నీటిని పంచుకోవాలన్న 1944 ఒప్పందం ఉమ్మడి ఏపీ పాలకుల చేతిలో ఉల్లంఘనకు గురైందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేసి కెనాల్‌ కు 39.9 టీఎంసీలు దక్కగా, రాజోలి బండకు 17.10 టీఎంసీలు (15.9 టీఎంసీలు మహబూబ్‌ నగర్‌ జిల్లాకు, 1.2 టిఎంసిలు రాయచూర్‌ జిల్లాకు) మాత్రమే దక్కాయనేది తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కేసి కెనాల్‌ ఆయకట్టును 2.78లక్షల ఎకరాలుగా నిర్ధారించారు. రాజోలిబండ ఆయకట్టును 92,900 ఎకరాలుగా (87,000 ఎకరాలు మహబూబ్‌ నగర్‌ కు) కన్‌ఫర్మ్ చేశారు.

1958లో రాజోలిబండ ఆనకట్ట నిర్మాణం పూర్తి అయ్యింది. రాజోలిబండ నిర్మాణం ప్రారంభించేప్పుడు పది తూములను ప్రతిపాదించారు. అయితే, 1956లో ఏర్పడ్డ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏడు తూములు మూసివేసి, కేవలం మూడింటిని తెరిచి ఉంచడంతో రగడ మొదలైంది. దాని వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని తెలంగాణవాదులు ఆరోపణలు మొదలు పెట్టారు. 15.9 టీఎంసీలలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని గద్వాల తాలూకాలోని 7 గ్రామాలకు, ఆలంపూర్‌ తాలుకాలో 67 గ్రామాల్లో మొత్తం 87,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. కేటాయింపుల్లోనే అన్యాయం జరిగిందని ఆరోపణలుంటే.. వినియోగంలో మరింత అన్యాయం జరిగిందనేది తెలంగాణ ఉద్యమ కాలంలో వినిపించిన ఆరోపణ. రాజోలిబండ కాలువకు సగటున 5.5 టీఎంసీలకు మించి దక్కలేదని రికార్డులు కూడా చెబుతున్నాయి.

87,500 ఎకరాలకు నీరందించాల్సి వుండగా.. 30 వేల ఎకరాలకు మించి ఏనాడు సాగుకు నోచుకోలేదని, నీరు అందలేదని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం ఆయకట్టులో సాగునీరు అందుతున్నది కేవలం 36 శాతం మాత్రమే. 64 శాతం ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందక దుర్భిక్ష ప్రాంతంగా మారింది. ఈనాటికి అదే పరిస్థితి వుందన్న ఆరోపణలున్నాయి. 39.9 టీఎంసీలు వాడుకోవాలసిన కేసి కెనాల్.. సగటున ఏటా 55 నుంచి 60 టీఎంసీలు ఉపయోగించుకున్నట్లుగా రికార్డులున్నాయి. సుంకేసుల ఆనకట్ట బ్యారేజీగా మారింది. కె.సి.కెనాల్‌‌ను ఆధునికరించారు. ఆర్‌డిఎస్‌ మాత్రం శిథిలమైన స్థితిలో ఉండిపోవడంపై వివాదం కొనసాగుతోంది. రాజోలిబండ ఆనకట్ట ఎడమ వైపున ఆర్‌డిఎస్‌ కాలువ వుంది. కాలువ మొత్తం పొడవు 143 కిలోమీటర్లు. కర్నాటకలోని రాయచూర్‌ జిల్లాలో 42.6 కి.మీ. ప్రయాణిస్తుంది. తర్వాత మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కాలువ 42.6 కి.మీ నుంచి 143 కి.మీ. దాకా ప్రయాణిస్తుంది.

2001లో కె.సి.ఆర్‌. తెలంగాణారాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత రాజోలిబండ పాదయాత్ర చేశారు. తన జల సాధనా ఉద్యమాన్ని ఆర్‌డిఎస్‌ నుంచే మొదలు పెట్టారు కేసీఆర్. ఆర్‌డిఎస్‌ కాలువపై కేసీఆర్ పాదయాత్ర కొనసాగింది. ఆర్‌డిఎస్‌ కాలువని ఆధునీకీకరించాలని, ఆర్‌డిఎస్‌ ఆనకట్ట వద్ద తెరిచి ఉంచిన తూములను మూసివేయాలని డిమాండ్‌ చేశారు అప్పట్లో కేసీఆర్. 2003 జూలై 20న రాజోలిబండ పాదయాత్రను మొదలు పెట్టారు. ఆలంపూర్‌ నుంచి గద్వాల వరకు 120 కి.మీ.ల దూరం 30 గ్రామాల గుండా కేసీఆర్ పాదయాత్ర కొనసాగింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండడంతో ఆర్డీఎస్ తూములను మూసి వేయాలని ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. కానీ రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలనాగిరెడ్డి తదితరులు తూముల మూసివేతను అడ్డుకున్నారు. తూముల మూసివేత కోసం చేపట్టిన పనులను నాటుబాంబులతో పేల్చివేశారు. దాంతో తూముల మూసివేత కార్యక్రమానికి బ్రేక్ పడింది.

అయితే, 2008లో వైఎస్ఆర్ ప్రభుత్వం తూములను మూసివేయించింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ రాజోలిబండ కుడి కాలువకు 4 టీఎంసీలను కేటాయించింది. రాజోలిబండకు కుడి వైపున కర్నూలు‌ జిల్లా వుంది. రాజోలిబండ కుడికాలువ కోసం పట్టు బట్టి మరీ 4 టీఎంసీలు సాధించుకున్నది ఏపీ ప్రభుత్వం. సుంకేసుల బ్యారేజి నుంచి ఎడమ వైపున ఉన్న మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ప్రయోజనం వుంటుందని భావించి ఆ డిమాండ్ తెరమీదికి వచ్చింది. కానీ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుంకేసుల ఎడమ కాలువ జోలికి పోలేదు. ఆర్‌డిఎస్‌ కెనాల్‌కు కేసి కెనాల్‌తో సమానంగా కేటాయింపులు లేవన్నది నాడు, నేడు వివాదం. ఆర్‌డిఎస్‌ కాలువ కింద ఆయకట్టు స్థిరీకరణ జరగాల్సి వుంది. రాజోలిబండ మళ్లింపు పథకం ద్వారా సాగు నీరు అందని 55,600 ఎకరాలకు నీరందించేందుకు మరో ప్రత్యామ్నాయ పథకాన్ని తెరమీదికి తెచ్చారు. దానిపేరే తుమ్మిళ్ళ. సుంకేసుల ఎడమ వైపున తుంగభద్ర నీటి కోసం ఆలోచన ఇది. ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికే తుమ్మిళ్ళ పథకాన్ని రూపొందించారు. 2017 ఏప్రిల్‌లో జీవో నెంబర్ 429 ద్వారా తొలి దశ పనులకు పరిపాలనపరమైన అనుమతులిచ్చారు. రూ.397 కోట్లకు పరిపాలనా అనుమతి లభించింది. మొదటి దశలో తుమ్మిళ్ళ గ్రామం వద్ద నిర్మాణాలు మొదలు పెట్టారు. తుంగభద్రా నది నుంచి 70 రోజుల్లో 5.44 టిఎంసిల నీటిని ఎత్తిపోసే పథకాన్ని రూపొందించారు.

రెండవ దశలో మూడు బ్యాలెన్సింగ్‌ జలాశయాలకు నీటిని ఎత్తి పోయాలని తలపెట్టారు. 5.5 ఎంవీ సామర్థ్యం కలిగిన రెండు పంపులు, 10.5 ఎంవీల సామర్థ్యం కలిగిన మరో పంపు కలిపి మొత్తం 3 పంపులను ఏర్పాటు చేశారు. రెండు పంపుల డిశ్చార్జ్‌ సామర్థ్యం 9.72 క్యూసెక్కులు (343.26 క్యూసెక్కులు) నేరుగా ఆర్‌డిఎస్‌ కాలువలోకి నీరు పంపింగ్ చేయాలని తలపెట్టారు. మూడవ పంపు డిశ్చార్జ్ సామర్థ్యం 11.10 క్యూసెక్కులు (392 క్యూసెక్కులు)గా ప్రతిపాదించారు. నేరుగా మల్లమ్మ కుంట జలాశయానికి నీరు చేర్చేలా ప్రతిపాదన చేశారు. నది నుంచి పంప్‌ హౌజ్‌ దాకా 650 మీటర్ల పొడవైన అప్రోచ్‌ చానల్‌, ఫోర్బే, పంప్‌ హౌజ్‌, ప్రెషర్‌ పైప్‌ లైన్‌, సిస్టర్న్‌ నిర్మిస్తున్నారు. 2.5 మీ వ్యాసం కలిగిన 7.80 కి.మీ. పొడవైన రెండు పైప్‌ లైన్లు వేయనున్నారు. రెండో దశలో 3 జలాశయాలను (మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు) నిర్మించాలని ప్రతిపాదించారు.

ఇందుకోసం మొదటి దశలో 94 ఎకరాల భూమిని సేకరించాలని ప్రతిపాదించారు. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఆర్‌డిఎస్‌ కాలువకు నీరు అందించాలనే ఆలోచన క్రమంగా సాకారమవుతుంది. తుంగభద్ర నది నీటిని ఆర్డీఎస్‌ కాల్వకు మళ్ళిస్తున్నారు. 55 వేల 600 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 0రూ.783 కోట్లు వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. మొదటి దశలో రూ.389 కోట్లతో తుమ్మిళ్ల పనులు పూర్తి చేస్తారు. ఇందుకోసం మూడు పంపులు ఏర్పాటు చేస్తున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశకు శ్రీకారం చుట్టారు. త్వరలో పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్‌కు ఎగువన కొత్త కాల్వ పనులకు శ్రీకారం చుట్టింది. కృష్ణా, తుంగభద్ర రివర్‌ బోర్డు నిబంధనలపై ఒకవైపు తకరారు కొనసాగుతుండగానే ఏపీ ప్రభుత్వం కొత్త కాల్వ పనులను చేపట్టింది. సుమారు రెండు వేల కోట్ల రూపాయల అంఛనా వ్యయంతో కొత్త కాల్వ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు భారీ రిజర్వాయర్లు, మూడు ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన పాత తీర్పును అమలు చేస్తున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. రాజోలి బండ ఎగువ కుడి వైపున కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి కొత్త కాల్వ తవ్వకం పనులు జరుగుతున్నాయి. నాలుగు టీఎంసీలకు బదులు అందుకు రెండు రెట్లు అదనంగా నీటిని తరలించేలా కాల్వలను డిజైన్ చేశారు. దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజోలి బండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) నుంచి తుంగభద్ర నీటిని తరలించనున్నది ఏపీ ప్రభుత్వం.

ఏపీలోని కర్నూల్‌ జిల్లా కోస్గి మండలం సాతనూరు, ఐతనూరు గ్రామాల మధ్య నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 160 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వనున్నారు. కర్నూల్‌ జిల్లా ఎగువ, దిగువ ప్రాంతాలకు సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేందుకే ఈ కొత్త కాలువ నిర్మాణమని ఏపీ సర్కార్ చెబుతోంది. ఈ కాల్వ నుంచి రెండు భారీ రిజర్వాయర్లను నింపుకునే ఆలోచన చేస్తున్నారు. మూడు ఎత్తిపోతల పథకాలకు నీటిని మళ్లించాలని భావిస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర బోర్డుల నుంచి అనుమతులు మాత్రం లేవు. ఈ కొత్త కాలువ నిర్మాణం పూర్తయితే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న తుమ్మిళ్ళ ప్రాజెక్టుకు నీరు రాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్డీఎస్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల వాటాను కోల్పోతామని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ నీటి హక్కును కోల్పోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో అలంపూర్‌ నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా దానికి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త కాలువ అడ్డుగా నిలువనున్నది.

ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌కు ఎగువన కొత్త కాల్వను నిర్మిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగువన రూ.799 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్లకు వరద నీరు రాకుండా పోయే పరిస్థితి కొత్త కాలువ ద్వారా తలెత్తుతుందని భయపడుతున్నారు. కొత్త కాలువ నిర్మాణంపై కేంద్రానికి పిర్యాదు చేసినా ఫలితం లేదని తెలంగాణ పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఆర్డీఎస్ ఆధారంగా ఇరు ప్రభుత్వాలపై విమర్శలకు దిగుతున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త కాల్వ నిర్మాణాన్ని అడ్డుకుంటామన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ రాయాలని, అవసరమైన వేదికలపై ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని టీ.కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త కాలువ నిర్మాణాన్ని ఆపేసేందుకు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఏపీ సర్కార్ చర్యలను కేసీఆర్ ప్రభుత్వం మొక్కుబడిగా వ్యతిరేకిస్తుందని, నిజానికి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కుమ్మక్కయ్యారని తెలంగాణ బీజేపీ నేత, ఆర్డీఎస్ పరీవాహక ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి డీ.కే. అరుణ ఆరోపిస్తున్నారు.

ALSO READ: మండిపోతున్న భానుడు.. ఎండల తాకిడికి జనం విలవిల.. మరింత పెరుగుతాయని హెచ్చరిక

ALSO READ: తిరుపతి కోసం బీజేపీ కొత్త గేమ్ ప్లాన్.. జనసేనాని మచ్చిక కోసం ప్రత్యేక వ్యూహం