తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం డిసెంబర్ 28వ తేదీ నుంచి అప్లికేషన్స్ను స్వీకరిస్తున్నారు.
గ్రామ, వార్డుల్లో సభలు నిర్వహిస్తూ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 31న ఆదివారం, జనవరి 1న దరఖాస్తుల స్వీకరణకు అధికారులు విరామం ఇవ్వగా నేటి నుంచి (మంగళవారం) నుంచి దరఖాస్తుల స్వీకరణ తిరిగి ప్రారంభంకానుంది. ప్రజాపాలనలో ఇప్పటివరకు 40.57 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. పింఛన్లు, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులపై ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇప్పటికే పింఛను, రైతుబంధు వస్తున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో దరఖాస్తుల సంఖ్య కోటి దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాలపాలన దరఖాస్తుల్లో గ్యాస్ సిలిండర్, 2,500, గృహ జ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాసబ్ ట్యాంక్ ఫుట్బాల్ గ్రౌండ్లో నేడు జరిగే ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరుకానున్నారు. ఇక ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు జరగనుంది.
ఇదిల ఉంటే కొన్ని చోట్ల ప్రజాపాలన దరఖాస్తులు అమ్ముతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. దరఖాస్తులు అమ్మితే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందనివారు, కొత్తగా లబ్ధిపొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..