Telangana: అంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సర్.. ఏసీబీ అంటూ MROకు కుచ్చుటోపీ
అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ దాడులు రైళ్లు పరిగెత్తిస్తుంటే.. సైబర్ దొంగలు మాత్రం దాన్ని ఓ క్యాష్ మేకింగ్ బిజినెస్గా మార్చుకుంటున్నారు. ఈ నెల 6న సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఈ ఘటనతో చేర్యాల మండల రెవెన్యూ విభాగంలోని అధికారులు తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయారు. సరిగ్గా ఇదే అదనుగా చూసుకుని సైబర్ క్రిమినల్స్ రంగంలోకి దిగారు.

ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ ఏసీబీకి దొరకడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇదే రెవెన్యూ అధికారుల భయాన్ని ఆసరాగా చేసుకున్నారు కొందరు సైబర్ కేటుగాళ్లు. ఏసీబీ భయంతో వణికిపోతున్న అధికారులను టార్గెట్ చేస్తూ.. తాము ఏసీబీ అధికారులమని చెప్పి బ్లాక్మెయిలింగ్కు తెరలేపారు.తాజాగా చేర్యాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) ఐలయ్యకు ఫోన్ చేసి.. నీపై అవినీతి కేసులు ఉన్నాయంటూ బెదిరించి ఏకంగా లక్ష రూపాయలు గుంజారు.ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆర్ఐ లబోదిబో మంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) తలారి ఐలయ్యకు గురువారం ఒక గుర్తుతెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ఏసీబీ డీఎస్పీ నంటూ పరిచయం చేసుకున్నాడు. నీపై కూడా పలు అవినీతి ఫిర్యాదులు వచ్చాయి.. నీ ఆఫీస్,ఇళ్లపై ఏసీబీ దాడులు జరగబోతున్నాయి అంటూ తీవ్రంగా బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆర్ఐ ఐలయ్య.. ఈ కేసుల నుంచి తన పేరు తీసేయాలని సదరు నకిలీ అధికారిని వేడుకున్నాడు. మ్యాటర్ సెటిల్ అవ్వాలంటే ఒక లక్ష రూపాయలు వెంటనే పంపాలని ఆ కేటుగాడు డిమాండ్ చేశాడు.
ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో.. ఏసీబీ చేతికి చిక్కితే సమాజంలో అవమానం జరుగుతుందో అనే టెన్షన్లో ఆర్ఐ వెనకా ముందు ఆలోచించలేదు. సదరు నకిలీ డీఎస్పీ చెప్పిన మొబైల్ నంబర్కు వెంటనే రూ. 96,000 ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ అదే నంబర్కు ఫోన్ చేయగా.. అవతలి ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో తాను ఘోరంగా మోసపోయా నని గ్రహించిన ఆర్ఐ ఐలయ్య.. తల పట్టుకున్నారు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు మరియు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
