
వీరికి… పక్షులు అంటే ప్రేమ. వాటికీ కడుపు నిండా తిండి పెడుతారు. ఉదయం పూట పక్షుల కిల.. కిలలు.. ఇంటి చుట్టూ పక్షులతో నిండి ఉంటుంది. ఈ ఇంట్లో అడుగు పెడితే ముందుగా పక్షులే దర్శనమిస్తాయి. గోడ, ఇంటిపై వాలుతాయి. ఆకలి అయితే చాలు.. అరుస్తుంటాయి. అంతే కాదు.. పక్షుల కోసం వారు ప్రత్యేకంగా వంట కూడా చేస్తున్నారు. కడుపు నిండా తిన్న తరువాత అవి ఎగిరి పోతాయి. ఇదే ప్రాంతంలో పక్షులు ఎక్కువగా తిరుగుతున్నాయి. దీంతో ఈ ఇల్లు చిన్నపాటి పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ దంపతులకు పక్షులపై ఎందుకు అంత ప్రేమ కలిగింది. ఎందుకు వాటికోసం ప్రత్యేకంగా వంట చేస్తూ వాటిని పోషిస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్ చెందిన అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు ఎంతోమంది విద్యార్థులకు దారి చూపారు. ఆ తర్వాత రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఈ విశ్రాంత సమయంలో వారు పక్షి ప్రేమికులుగా మారిపోయారు. ఉదయం పూట వారు తినేటువంటి బిస్కెట్, ఇడ్లీలను పక్షులకు పెడుతున్నారు. అంతేకాదు వారు అన్నం తినే ముందు పక్షులకు తమ ఇంటి ముందు గోడపైన అన్నం పెట్టి వారు తింటారు. 10 నిమిషాలు ఆలస్యమైతే చాలు మధ్యాహ్నం పూట వారి ఇంటి పైన పక్షులు గిరగిరా తిరుగుతుంటాయి. వారు ఎటైనా ఊరికి వెళ్తే ఇంటి ముందు పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుంటాయి. అయితే నిత్యం వాటి కడుపు నింపుతున్న ఈ పక్షి ప్రేమికులను చూసి అందరూ ఈ దంపతులను శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
పిచ్చుక.. కాకులు ఇతర పక్షులకు ఈ ఇల్లు ఇప్పుడు ఆవాస కేంద్రంగా మారిపోయింది. సహజంగా కాకులకు మనుషులు కనబడుతే చాలు.. అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఈ దంపతులను చూస్తే మాత్రం పక్షులు వారి దగ్గరి వరకు వస్తున్నాయి. అప్పుడప్పుడు చేతిపై కూడా వాలుతున్నాయి. ఎటు వెళ్లినా కూడా.. వీటికి ఆహారం అందించిన తర్వాతే వారు బయటకు వెళ్తున్నారు. వివిధ రకాల పక్షులను చూడాలంటే ఈ ఇంటికి రావాల్సిందే. ఇలా ఆహారం పెట్టడం.. తమకు ఎంతో తృప్తి ఉందని చెబుతున్నారు ఈ దంపతులు.