
రాజన్న సిరిసిల్ల, జులై 7: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన దొంతినేని పాపారావు-పద్మ దంపతుల కుమార్తె సౌమ్యకు హైదరాబాద్కు చెందిన లోకినేని రఘుతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా ఈ దంపతులు తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా రాధాపురం తాలూకా అనువిజయ్ టౌన్షిప్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు యశ్వన్ (7) అందరి ముద్దుబిడ్డ.
జూన్ 29 సాయంత్రం టౌన్షిప్లో సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న యశ్వన్ను అతివేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి వైద్యులు ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో యశ్వన్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. అది ఏ తల్లిదండ్రులైనా తట్టుకోలేని క్షణం. అయినా తమ బిడ్డ మరణాన్ని కన్నీళ్లతో మాత్రమే ముగించలేదు. మా బాబు లేకపోయినా… ఇంకొంతమంది పిల్లల్లో, మనుషుల్లో బతకాలి అనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తాత పాపారావుతో కలిసి అవయవ దానానికి అంగీకరించారు.
జూలై 6న యశ్వన్ అవయవాలను దానం చేశారు. అతని రెండు కిడ్నీలు ఒక నాలుగేళ్ల చిన్నారికి, 17 ఏళ్ల యువకుడికి కొత్త జీవితాన్ని అందించాయి. కాలేయం, గుండె కవాటం మరో ఇద్దరు రోగులకు ప్రాణాధారమయ్యాయి. రెండు కంటిపాపలు ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇలా ఏడేళ్ల చిన్నారి… ఆరుగురికి పునర్జన్మనిచ్చి అమరజీవిగా నిలిచిపోయాడు. బిడ్డను కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని, సమాజం కోసం తీసుకున్న ఈ నిర్ణయం అవయవ దానంపై ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించేలా ఉంది. యశ్వన్ ఇక లేడు… కానీ అతని గుండె చప్పుడు, అతని చూపు, అతని జీవం ఇప్పుడు మరో ఆరుగురిలో కొనసాగుతోంది. జీవితం ఎంత చిన్నదైనా… మనం చేసే మంచి మాత్రం శాశ్వతం అని యశ్వన్ కుటుంబం మరోసారి సమాజానికి గుర్తు చేసింది. ఏడేళ్ల చిన్నారి చేసిన ఈ మహాదానం ఎందరికో స్ఫూర్తిగా నిలవనుంది.