Women’s Asia Cup 2024: అదరగొట్టిన అమ్మాయిలు.. ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా.. సెమీస్‌లో బంగ్లా చిత్తు

|

Jul 26, 2024 | 5:46 PM

శ్రీలంకలోని దంబుల్లాలోని రంగిరీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత భారత జట్టు కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన స్మృతి మంధాన, షఫాలీ వర్మ 83 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు

Women’s Asia Cup 2024: అదరగొట్టిన అమ్మాయిలు.. ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా.. సెమీస్‌లో బంగ్లా చిత్తు
Women's Asia Cup 2024
Follow us on

భారత అమ్మాయిలు అదరగొట్టారు. శుక్రవారం (జులై 26) బంగ్లాదేశ్ తో జరిగిన తొలి ఆసియా కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా అజేయ జట్టుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. శ్రీలంకలోని దంబుల్లాలోని రంగిరీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత భారత జట్టు కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన స్మృతి మంధాన, షఫాలీ వర్మ 83 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ధనాధన్ బ్యాటింగ్‌ చేసిన స్మృతి 39 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 55 పరుగులు చేయగా, షఫాలీ వర్మ 28 బంతుల్లో 2 ఫోర్లతో అజేయంగా 26 పరుగులు చేసింది. లీగ్ రౌండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ జట్టును సులువుగా ఓడించి వరుసగా ఐదోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈరోజు రాత్రి పాకిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌లో విజేతగా నిలిచిన భారత్‌తో జూలై 28న ఫైనల్‌లో తలపడనుంది.

తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టుకు స్పీడ్ స్టర్ రేణుక షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ ఓపెనర్ దిలారా అక్తర్ వికెట్ తీసి భారత్‌కు శుభారంభం ఇచ్చింది. తన రెండో ఓవర్లో వికెట్ల వేట ప్రారంభించిన రేణుక.. మరో ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ ను ఔట్ చేసింది. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇష్మా తంజీమ్ కూడా 8 పరుగులు చేసి రేణుకా సింగ్ చేతికి చిక్కింది. దీంతో ఆ జట్టు కేవలం 23 పరుగులకే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా బంగ్లా జట్టు వికెట్ల పతనం కొనసాగింది. తొలుత రేణుకా సింగ్ ధాటికి బంగ్లాదేశ్‌ బెదిరిపోగా, ఆ తర్వాత రాధా యాదవ్‌ స్పిన్‌ వలలో చిక్కుకుంది. అయితే ఒకవైపు వరుసగా వికెట్లు పడిపోతున్నా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ నిగర్ సుల్తానా అత్యధికంగా 32 పరుగులు చేసి జట్టును 80 పరుగుల మార్కుకు చేర్చింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..