ముంబై: ప్రపంచకప్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. ఇది ఇలా ఉంటే.. ఆల్రౌండర్ విజయ్ శంకర్ బొటని వేలు గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక అతని స్థానంలో కర్ణాటక బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రిజర్వ్ ప్లేయర్గా ఉన్న అంబటి రాయుడిని కాదని.. ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని మయాంక్ను జట్టులోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. మరోవైపు అంబటి రాయుడు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు ఇవాళ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రపంచకప్ జట్టులో తనకు చోటు దక్కకపోవడం వల్ల రాయుడు గతంలో సెలెక్టర్ ఎంఎస్కె ప్రసాద్ను ఉద్దేశించి ఓ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్ వల్లే రాయుడిని కావాలనే సెలెక్టర్లు ఎంపిక చేయలేదని అందరూ భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాయుడిని కాకుండా మయాంక్ను జట్టులోకి తీసుకోవడం వెనక సెలెక్టర్ల ప్రమేయం లేదని తెలుస్తోంది. మయాంక్ను పంపాలని యాజమాన్యం నిర్ణయించిందని.. ఇక ఈ సెలక్షన్పై సెలెక్టర్లు ప్రశ్నించరాదని చెప్పినట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఫామ్ను దృష్టిలో ఉంచుకుని కోహ్లీ, శాస్త్రీ రాయుడి కన్నా మయాంక్ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. అందుకే యాజమాన్యం మయాంక్ను ఎంపిక చేసి ఉంటుందని సమాచారం. అయితే స్టాండ్ బైగా రాయుడు ఉన్నా కోహ్లీ, శాస్త్రీ వద్దనడంతోనే యాజమాన్యం పక్కనబెట్టిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా బీసీసీఐకి పంపిన లేఖలో కోహ్లీ, ధోనికి రాయుడు ధన్యవాదాలు తెలపడం విశేషం.