AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘గ్రీన్ జెర్సీ’లో కింగ్ కోహ్లీ.. 4 ఏళ్ల చెత్త చరిత్ర రిపీట్.. అదేంటంటే?

Virat Kohli Green Jersey Stats: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రతి ఏడాదీ ఒక మ్యాచ్‌ను 'గ్రీన్ జెర్సీ'లో ఆడుతుందనే విషయం తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఇదే ఆకుపచ్చ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే, ఈ ప్రత్యేకమైన జెర్సీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందో ఓసారి చూద్దాం..

Virat Kohli: 'గ్రీన్ జెర్సీ'లో కింగ్ కోహ్లీ.. 4 ఏళ్ల చెత్త చరిత్ర రిపీట్.. అదేంటంటే?
Virat Kohli Records
Venkata Chari
|

Updated on: Apr 18, 2026 | 6:06 PM

Share

Virat Kohli Green Jersey Stats: సాధారణంగా తమ సంప్రదాయ ఎరుపు రంగు జెర్సీలో అద్భుతాలు చేసే విరాట్ కోహ్లీ, ఆకుపచ్చ జెర్సీలో కూడా మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 ఇన్నింగ్స్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 142 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 522 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు, ఒక అద్భుతమైన శతకం కూడా ఉన్నాయి. ఈ జెర్సీలో బరిలోకి దిగినప్పుడు అతడు ఏకంగా 32 ఫోర్లు, 24 సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. జట్టు జెర్సీ రంగు మారినప్పటికీ తన బ్యాటింగ్ జోరు తగ్గలేదని కోహ్లీ నిరూపించాడు.

గ్రీన్ జెర్సీలో విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ 2016లో నమోదైంది. ఆ సీజన్‌లో రికార్డు స్థాయిలో 973 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. గుజరాత్ లయన్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తోటి ఆటగాడు ఏబీ డివిలియర్స్ తో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 55 బంతుల్లోనే 198 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ ఆడిన ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్ వల్ల ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 144 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రీన్ జెర్సీలో ఆర్సీబీకి లభించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.

2013 నుంచి 2019 వరకు ఆకుపచ్చ జెర్సీలో అదరగొట్టిన కోహ్లీ, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు కాస్త ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా 2021 నుంచి 2024 మధ్య కాలంలో కోల్‌కతా, హైదరాబాద్, రాజస్థాన్ జట్లపై వరుసగా 5, 0, 0, 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నాలుగు మ్యాచ్‌లలో పరుగులు రాబట్టడంలో తీవ్రంగా తడబడ్డాడు.

అయితే, 2025 సీజన్‌లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకం సాధించి మళ్లీ తన లయ అందుకున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రెండు అద్భుతమైన షాట్లతో మంచి టచ్‌లో కనిపించినప్పటికీ.. 19 పరుగుల వద్ద లుంగీ ఎంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్న కోహ్లీ.. ఈసారి తన స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 158 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. అయితే, జట్టు కోసం వేగంగా పరుగులు సాధించే క్రమంలో విరాట్ తరచూ 20 లేదా 30 పరుగుల వ్యవధిలోనే తన వికెట్ కోల్పోతుండటం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us