Virat Kohli: ఇది కింగ్ కోహ్లీ అంటే! తన కోసం వచ్చిన అభిమానులను ఇంట్లోకి ఆహ్వానించి మరీ.. ఫొటోస్ వైరల్

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో పరుగులు చేసినా, చేయకపోయినా అతని పాపులారిటీ అసలు తగ్గదు. పైగా రోజు రోజుకు విరాట్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇటీవల కోహ్లీ ఆడిన రంజీ మ్యాచ్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

Virat Kohli: ఇది కింగ్ కోహ్లీ అంటే! తన కోసం వచ్చిన అభిమానులను ఇంట్లోకి ఆహ్వానించి మరీ.. ఫొటోస్ వైరల్
Virat Kohli

Updated on: Feb 04, 2025 | 1:09 PM

ప్రపంచ క్రికెట్ లో పరుగుల రారాజు గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. పరుగులు చేసేందుకు తంటాలు పడుతున్నాడు. గత కొంత కాలంగా కోహ్లీ ఆశించినట్లుగా ఏదీ జరగడం లేదు. గత ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేయడం మినహా ఈ మధ్యన విరాట్ బ్యాట్ గర్జించింది లేదు. దీంతో రంజీ ట్రోఫీలోనైనా అడుగు పెట్టి తన సమస్యను అధిగమిద్దానుకున్నాడు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సింగిల్ డిజిట్‌ కే వెనుదిరిగాడు. దీంతో, కోహ్లీ ఆటను వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నాడు కింగ్ కోహ్లీ. ఇందుకోసం గురుగ్రామ్‌లోని తన కొత్త ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ గురుగ్రామ్‌లోని తన ఇంట్లో దాని కోసం సిద్ధమవుతున్నాడు. కోహ్లీని చూసేందుకు వందలాది మంది అభిమానులు అతని ఇంటి దగ్గర గుమిగూడుతున్నారు. వీరిలో కొందరు అభిమానులు కోహ్లీని చూడాలని ఆశతో రాత్రి పొద్దుపోయే వరకు అతని ఇంటి ముందు ఎదురు చూశారు. ఇది గమనించిన కోహ్లీ వారిని తన ఇంట్లోకి ఆహ్వానించడమే కాకుండా, వారికి ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు కోహ్లీని ప్రశంసిస్తున్నారు.

బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు 13 సంవత్సరాల తర్వాత కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. అతని ఆటను చూడటానికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వేలాది మంది అభిమానులు గుమిగూడారు. అయితే, అతను దేశీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం ఆశించిన విధంగా జరగలేదు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో, అతను 15 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టాడు కోహ్లీ.. దుబాయ్‌లో జరిగే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి భారతదేశం సన్నాహాల్లో అతని ఫామ్ కీలకం కానుంది. ఈ సిరీస్ కోసం విరాట్, కెప్టెన్ రోహిత్ శర్మ నాగ్‌పూర్ చేరుకున్నారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

అభిమానులతో కింగ్ కోహ్లీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..