
Virat Kohli Retirement: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్వహించిన తాజా కార్యక్రమంలో విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన పనిలేదని పేర్కొన్నాడు. ఆట కోసం తాను పడే కష్టం, తన సన్నద్ధత ఎప్పుడూ అత్యున్నత స్థాయిలోనే ఉంటాయని, ఒకవేళ తన విలువను నిరూపించుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే, ఆ ప్రదేశం తనకు సరైనది కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
“నేను జట్టులో భాగమైనప్పుడు నా వల్ల జట్టుకు ప్రయోజనం ఉండాలి. అలాగే నా సేవలను జట్టు కూడా గుర్తించాలి. నా శ్రమను, అంకితభావాన్ని శంకించి, పదే పదే నన్ను నిరూపించుకోమంటే నేను అక్కడ ఉండలేను. ఎందుకంటే నా సన్నద్ధత విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటాను. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా సర్వస్వాన్ని ధారపోస్తాను. జట్టు కోసం 40 ఓవర్ల పాటు బౌండరీల వద్ద పరుగెత్తమన్నా నేను సిద్ధమే. 50 ఓవర్ల పాటు ప్రతి బంతిని నా కెరీర్ లో చివరి బంతిగా భావించి ఆడతాను” అని విరాట్ భావోద్వేగంగా మాట్లాడాడు.
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడిన అనుభవాలను కోహ్లీ పంచుకున్నాడు. రెండు దశాబ్దాల తర్వాత ఈ టోర్నీలో ఆడుతున్నప్పుడు తనకు మళ్లీ చిన్నపిల్లాడిలా అనిపించిందని చెప్పుకొచ్చాడు. “అక్కడ ఎవరూ లేరు, కానీ నేను బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతాను కాబట్టి ఆడాను. కేవలం ఆటపై ఉన్న మక్కువతోనే నేను మైదానంలోకి దిగాను. ఇతరులు ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. పారదర్శకత లేని చోట నేను ఇమడలేను” అని కోహ్లీ వివరించాడు.
తన ఫిట్నెస్, జీవనశైలి గురించి చెబుతూ, తానూ ఏదో ఒక సిరీస్ కోసం ప్రత్యేకంగా కష్టపడనని, ఏడాది పొడవునా ఒకే క్రమశిక్షణతో ఉంటానని తెలిపాడు. 2027 ప్రపంచకప్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఆ సమయానికి తన సేవలు జట్టుకు అవసరమని అనిపించి, తాను కూడా జట్టుకు ఉపయోగపడతానని భావిస్తే కచ్చితంగా బరిలోకి దిగుతానని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్లో అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..