Video: మ్యాచ్ ఓడిపోయామంటూ వైభవ్ కన్నీళ్లు.. కట్‌చేస్తే.. వేలు చూపిస్తూ బెదిరించిన పరాగ్..

Vaibhav Suryavanshi Batting: చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభతో ఐపీఎల్ 2026 వేదికపై సంచలనాలు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు భారత క్రికెట్‌కు దొరికిన ఆశాకిరణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ నుండి రాజస్థాన్ నిష్క్రమించినప్పటికీ, వైభవ్ తన అద్భుతమైన పోరాట పటిమతో దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

Video: మ్యాచ్ ఓడిపోయామంటూ వైభవ్ కన్నీళ్లు.. కట్‌చేస్తే.. వేలు చూపిస్తూ బెదిరించిన పరాగ్..
Vaibhav Suryavanshi Cries Riyan Parag Argue Video

Updated on: May 30, 2026 | 12:38 PM

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైన తర్వాత మైదానంలో గుండెల్ని పిండేసే దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఒంటరి పోరాటం చేసిన భవిష్యత్తు ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ కన్నీటి పర్యంతమవగా, కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది.

డగౌట్‌లో గుక్కపెట్టి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ..

రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి ఎలాగైనా ఫైనల్‌కు దూసుకెళ్లాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో జట్టు విజయం కోసం తన సర్వస్వం ఒడ్డి పోరాడాడు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాననే బాధ అతడిని తీవ్రంగా కలిచివేసింది.

మ్యాచ్ ముగిసిన వెంటనే వైభవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లోనే కూర్చుని, తీవ్రమైన మనస్తాపంతో తన క్యాప్‌ను ముఖానికి అడ్డుపెట్టుకుని గుక్కపెట్టి ఏడ్చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తృటిలో సెంచరీ మార్కును అందుకోలేకపోయినా ఏమాత్రం అధైర్యపడని ఈ కుర్రాడు, జట్టు ఓడిపోవడాన్ని మాత్రం అస్సలు తట్టుకోలేకపోయాడు. మైదానంలో అతడు కార్చిన కన్నీళ్లు చూసి క్రికెట్ అభిమానుల హృదయాలు ద్రవించిపోయాయి.

వేలు చూపిస్తూ హెచ్చరించిన కెప్టెన్ రియాన్ పరాగ్..

ఇదిలా ఉండగా, మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఒక ఊహించని పరిణామం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. తీవ్రమైన బాధతో కన్నీరు మున్నీరవుతున్న వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, అతడిని ఓదార్చాల్సింది పోయి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైభవ్ వైపు వేలు చూపిస్తూ, కోపంతో ఏదో హెచ్చరిస్తున్నట్లు ఉన్న పరాగ్ హావభావాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దావానంలా వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రవర్తనపై వైభవ్ సూర్యవంశీ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు రియాన్ పరాగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. “సొంతంగా రాణించడం చేతకాని నువ్వు, జట్టు కోసం ప్రాణం పెట్టి ఆడిన 15 ఏళ్ల చిన్నపిల్లాడిని అంతలా బెదిరిస్తావా?” అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పరాగ్‌ను నిలదీస్తున్నారు.

నాకౌట్‌లో వీరోచిత పోరాటం.. ఆరెంజ్ క్యాప్ రేసులో దూకుడు..

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా అవతరించాడు. ఒకవైపు సీనియర్ ఆటగాళ్లు వికెట్లు చేజార్చుకుంటున్నా, ఈ చిన్న వయసులోనే అతడు చూపించిన పరిణతి అమోఘం. అటు ఎలిమినేటర్, ఇటు రెండో క్వాలిఫయర్.. రెండు అత్యంత ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ శతకానికి అత్యంత సమీపంలోకి వచ్చి తృటిలో మిస్ చేసుకున్నాడు.

అయినప్పటికీ, ఈ సీజన్‌లో అద్భుతమైన స్థిరత్వంతో పరుగులు రాబడుతూ ప్రస్తుతం అత్యధిక స్కోరర్ల జాబితాలో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. డగౌట్‌లో ఏడుస్తున్న వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ సహాయక సిబ్బంది దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కాసేపటికే కోలుకున్న ఈ యువ ఆటగాడు తిరిగి మైదానంలోకి వచ్చి ప్రశంసలు, అవార్డులను అందుకున్నాడు.

చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభతో ఐపీఎల్ 2026 వేదికపై సంచలనాలు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు భారత క్రికెట్‌కు దొరికిన ఆశాకిరణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ నుండి రాజస్థాన్ నిష్క్రమించినప్పటికీ, వైభవ్ తన అద్భుతమైన పోరాట పటిమతో దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. మైదానంలో కెప్టెన్ ప్రవర్తించిన వివాదాస్పద శైలి ఎలా ఉన్నా, ఈ ‘బాస్ బేబీ’ సృష్టించిన ప్రభంజనం మాత్రం ఈ సీజన్ ప్రత్యేకతలలో ఒకటిగా నిలిచిపోతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us