
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్పై రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. మొత్తంగా 93 పరుగులతో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత వైభవ్ చేసిన ఒక వినూత్న సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆనందంలో బ్యాట్ చూపిస్తూ గాల్లో రెండు వేళ్లతో A అనే ఇంగ్లీష్ అక్షరం వచ్చేలా సైన్ చేశాడు. ఈ A సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడటంతో క్రికెట్ అభిమానులు ఈ వండర్ కిడ్ మనసుకు హాట్స్ ఆఫ్ చెబుతున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెరిమనీలో ప్రముఖ కామెంటేటర్ మురళీ కార్తీక్ ఈ A సెలబ్రేషన్ గురించి వైభవ్ను నేరుగా ప్రశ్నించాడు. “ఈ A అంటే అర్థం ఏంటి బాబూ? ఇండియా-A జట్టుకు ఎంపికయ్యావని ఇలా చేశావా?” అని అడిగాడు. దానికి వైభవ్ చాలా తెలివిగా సమాధానాన్ని దాటవేసాడు. “అలాంటిదేం లేదు సార్, నేను ఊరికే సరదాగా అలా చేసేశాను.. గత మ్యాచ్లో చేసిన సెలబ్రేషన్కు కూడా ఎలాంటి అర్థం లేదు, దీనికి కూడా అంతే” అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో స్టేడియంలోని వారంతా అది కేవలం క్యాజువల్ సైన్ అనుకున్నారు.
మురళీ కార్తీక్ ముందు ఆ విషయాన్ని దాచేసనప్పటికీ.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్తో వైభవ్ సూర్యవంశీ మనసులోని అసలు మాటను పంచుకున్నాడు. ఈ A సెలబ్రేషన్ మరెవరికో కాదు.. తన ప్రాణమైన వాళ్ల అమ్మ కోసమేనని వెల్లడించాడు. వైభవ్ తల్లి పేరు ఆర్తీ సూర్యవంశీ. అందుకే తన కెరీర్లోనే అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్ను, ఆ హాఫ్ సెంచరీని తన తల్లికి అంకితం ఇస్తూ.. ఆమె పేరులోని మొదటి అక్షరం Aను అలా మైదానంలో చూపించాడన్నమాట. ఈ విషయాన్ని మీడియా ముందు పెద్దగా హడావుడి చేయడం ఇష్టం లేకే ప్రెజెంటేషన్లో అబద్ధం చెప్పానని ఈ చిన్నారి క్రికెటర్ ఒప్పుకున్నాడు.
𝙎𝙘𝙤𝙧𝙚 𝙧𝙪𝙣𝙨. 𝙄𝙣𝙫𝙚𝙣𝙩 𝙘𝙚𝙡𝙚𝙗𝙧𝙖𝙩𝙞𝙤𝙣. 𝙍𝙚𝙥𝙚𝙖𝙩. 👏#VaibhavSooryavanshi is keeping everyone guessing, including himself! 😅#TATAIPL #VaibhavSooryavanshi #RRvLSG pic.twitter.com/lwyuGt9UsC
— Star Sports (@StarSportsIndia) May 19, 2026
లక్నోపై వైభవ్ ఆడిన ఈ తుఫాన్ ఇన్నింగ్స్ చూసి బీహార్లోని అతని ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. కొడుకును క్రికెటర్గా చూడాలనే తండ్రి కల నెరవేరడమే కాకుండా.. ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తుంటే ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైభవ్ పెద్దన్నయ్య ఉజ్వల్ సూర్యవంశీ తన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “ఒక తండ్రి పడ్డ కష్టం ఎప్పటికీ వృధా పోదని నా తమ్ముడు వైభవ్ నిరూపించాడు. టీవీలో వాడి ఆట చూస్తున్నంత సేపు నాన్న గర్వంతో పొంగిపోయారు” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టాడు.
ఈ ఒక్క మ్యాచ్ గెలిపించినంత మాత్రాన సరిపోదని, అసలైన పని ఇంకా ముందుందని 15 ఏళ్ల వైభవ్కు కూడా బాగా తెలుసు. లక్నోను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచినప్పటికీ.. రాబోయే తదుపరి మ్యాచ్ రాయల్స్కు అత్యంత కీలకం కానుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో బలమైన ముంబై ఇండియన్స్ ను రాజస్థాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఇలాగే రాణించి జట్టును గెలిపిస్తేనే రాజస్థాన్కు ప్లేఆఫ్స్ టికెట్ అధికారికంగా కన్ఫర్మ్ అవుతుంది. మరి ముంబైపై ఈ బుడ్డోడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..