
ఐపీఎల్ 2026 సీజన్లో తన సంచలన బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన 15 ఏళ్ల అద్భుత బాలడు వైభవ్ సూర్యవంశీ త్వరలోనే భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం ప్రదర్శనపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, అతడి టీమిండియా ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకున్నప్పటికీ, టోర్నమెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ, ఈ సీజన్లో ఆడిన 16 మ్యాచ్లలో ఏకంగా 776 కి పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. ఒత్తిడితో కూడిన సమయాల్లోనూ ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వైభవ్ సూర్యవంశీ టీమిండియా సెలక్షన్ పై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ‘హిందుస్థాన్ టైమ్స్’తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైభవ్ భారత క్రికెట్ లో ఒక సరికొత్త అద్భుతం. రాబోయే రోజుల్లో అతను ప్రపంచ క్రికెట్ను శాసిస్తాడు. మా సెలక్టర్లందరూ ఐపీఎల్ మ్యాచ్లను మైదానంలో ఉండి చాలా నిశితంగా పరిశీలించారు. రాబోయే టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించి జరగబోయే ఎంపిక కమిటీ సమావేశంలో, వైభవ్ ప్రతిభకు తగ్గట్లుగా సెలక్టర్లు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం నాకుంది” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Video: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. స్టార్ ప్లేయర్పై నిషేధంతోపాటు జరిమానా..!
భారత క్రికెట్ రంగానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం వైభవ్ అని, అతను చాలా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ సరిహద్దులను దాటి సీనియర్ జట్టులో మెరుస్తాడని సైకియా ప్రశంసల వర్షం కురిపించారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ యువ ఆటగాడిని వీలైనంత త్వరగా భారత జట్టులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
జూన్ 6 నుంచి భారత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఐపీఎల్ సమయంలో ఆటగాళ్ల ఫిట్నెస్, పనిభారం నిర్వహణపై సైకియా స్పందించారు. ఐపీఎల్ సమయంలో ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీల నియంత్రణలో ఉంటారని, ఆ రెండు నెలలు వారి దినచర్యలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని చెప్పారు. అయితే, బోర్డు తరపున సాంకేతిక బృందం ఆటగాళ్ల ఫిట్నెస్ను వెలుపలి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్న ప్రతి ఆటగాడికి బోర్డు నియమావళి (SOPs) పై పూర్తి అవగాహన ఉందని, వారు వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారని తెలిపారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..