IND vs NZ Final: సంజూ @ 26.. ఎవడ్రా.. టీమిండియా విజయాన్ని ఇక అడ్డుకునేది..!
IND vs NZ Final: ఫైనల్ మ్యాచ్లో సంజూ శాంసన్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులందరి చూపు అహ్మదాబాద్ ఫైనల్పైనే ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మద్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) గురించి ఒక ఆసక్తికర గణాంకం ఇప్పుడు చర్చకు వస్తోంది.
26 పరుగులు చేస్తే భారత్ గెలుస్తుందా..?
సంజూ శాంసన్ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ గణాంకాలు ఒక ఆసక్తికర విషయాన్ని చెబుతున్నాయి. ఈ బ్యాటర్ ఇప్పటివరకు 61 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అందులో 53 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలతో మొత్తం 1310 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లలో 16 మ్యాచ్లలో శాంసన్ 25 పరుగులకంటే ఎక్కువ స్కోర్ చేశాడు. కాగా, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ 16 మ్యాచ్లన్నింటిలో భారత్ విజయం సాధించింది.
100 శాతం విక్టరీ రికార్డు..
సంజూ శాంసన్ ఒక టీ20 మ్యాచ్లో 26 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే భారత్ గెలిచిన రికార్డు ఇప్పటివరకు 100 శాతం ఉంది. అందుకే న్యూజిలాండ్పై ఫైనల్లో కూడా శాంసన్ నుంచి కనీసం 26 పరుగుల ఇన్నింగ్స్ వస్తే భారత్కు విజయం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ ఫామ్..
ఈ టోర్నమెంట్లో సంజూ శాంసన్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 232 పరుగులు చేశాడు. ఇందులో సగటు 77 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. అలాగే, స్ట్రైక్ రేట్ 201 కంటే ఎక్కువగా ఉంది. అలాగే ఈ వరల్డ్ కప్లో అతను 16 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు కూడా సృష్టించాడు. ఇది ఒక టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లో భారత బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా నిలిచింది. ఈ రికార్డు ముందుగా రోహిత్ శర్మ (Rohit Sharma) పేరిట ఉండేది (15 సిక్సర్లు).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
