
Team India: చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించినప్పటికీ, జట్టు బౌలింగ్ ప్రణాళికలపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నెట్ రన్ రేట్ (NRR) అత్యంత కీలకంగా మారిన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు.
ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అందరూ భారత్ భారీ నెట్ రన్ రేట్తో విజయం సాధిస్తుందని ఆశించారు. అయితే, ఐదుగురు ప్రధాన బౌలర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కెప్టెన్ సూర్య శివం దూబే చేత బౌలింగ్ చేయించడం చర్చనీయాంశమైంది. దూబే తన మొదటి ఓవర్లోనే 26 పరుగులు సమర్పించుకున్నా, తిరిగి అతనికి చివరి ఓవర్ ఇచ్చారు. ఆ ఓవర్లో కూడా 20 పరుగులు రావడంతో, దూబే కేవలం రెండు ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలను ‘గల్లీ క్రికెట్’ తరహాలో ఉన్నాయని గవాస్కర్ విమర్శించారు. 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే దూబేతో పదే పదే బౌలింగ్ చేయించడం వల్ల నెట్ రన్ రేట్ పెంచుకునే సువర్ణావకాశాన్ని భారత్ కోల్పోయిందని ఆయన మండిపడ్డారు. జింబాబ్వేను 120 పరుగుల లోపే ఆలౌట్ చేసి ఉంటే, వెస్టిండీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ భారత్కు లభించేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదివారం వెస్ట్ ఇండీస్తో జరగబోయే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే, ఫలితం నెట్ రన్ రేట్ ఆధారంగానే ఉంటుంది. ఇటువంటి సమయంలో జింబాబ్వేపై తక్కువ స్కోరుకే కట్టడి చేయకపోవడం జట్టుకు శాపంగా మారే అవకాశం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. అర్ష్దీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..