ధోని, రోహిత్‌, కోహ్లీ.. ఎవరికీ సాధ్యం కానీ రికార్డు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌! ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో అసాధారణ విజయం సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, మూడు జట్లను కూడా ప్లే ఆఫ్స్‌కు, క్వాలిఫైయర్ 1కు నడిపించాడు. ఇది 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరెవరూ సాధించని అద్భుతమైన ఘనత.

ధోని, రోహిత్‌, కోహ్లీ.. ఎవరికీ సాధ్యం కానీ రికార్డు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌! ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడు
Shreyas Iyer

Updated on: May 27, 2025 | 1:18 PM

ఐపీఎల్‌ చరిత్రలో మరే ప్లేయర్‌కు ఇప్పటి వరకు సాధ్యం కానీ రికార్డును శ్రేయస్‌ అయ్యర్‌ సాధించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అయ్యర్ కొత్త చరిత్ర లిఖించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడమే కాకుండా.. క్వాలిఫయర్-1‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌ అయ్యర్‌ తప్పితే మరొకరు లేదు. 2020లో కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫ్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లి, క్వాలిఫైయర్‌ 1 ఆడించాడు. అలాగే 2024లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కూడా అతని కెప్టెన్సీలో క్వాలిఫైయర్‌ 1తో పాటు ఫైనల్‌ కూడా ఆడింది. తాజాగా ఇప్పుడు ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ గెలుపుతో 19 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌, ఇప్పుడు పంజాబ్‌ను కెప్టెన్‌గా అయ్యర్‌ క్వాలిఫైయర్‌ 1కు తీసుకెళ్లాడు. ఇది సాధారణ ఘనత కాదు. ఎంతో మంది కెప్టెన్లకు కూడా ఇది సాధ్యం కాలేదు. ఐపీఎల్‌లో ధోని రెండు టీమ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ఒక్క చెన్నై సూపర్‌ కింగ్స్‌లోనే సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కోహ్లీ, రోహిత్‌ ఒక్కో టీమ్‌కు మాత్రమే కెప్టెన్లు వ్యవహరించారు. కానీ, అయ్యర్‌ మాత్రం తాను కెప్టెన్‌గా వ్యవహరించి మూడు జట్లను ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. క్వాలిఫైయర్‌ 1 ఆడించాడు. ఒక కప్పు కూడా గెలిచాడు.

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్‌ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేసి రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసి ఈజీగా మ్యాచ్‌ గెలిచింది. ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62, జోష్ ఇంగ్లీస్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి మ్యాచ్‌ను వన్‌సైడ్‌ చేసేశారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..