2027 వరల్డ్ కప్ స్వ్కాడ్ నుంచి పంత్ ఔట్.. గంభీర్ స్కెచ్తో బ్యాడ్ లక్కోడు గ్రాండ్ ఎంట్రీ..?
ODI World Cup 2027: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టీం ఇండియా వికెట్ కీపర్ స్థానంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఫామ్ కోల్పోయి తడబడుతున్న రిషబ్ పంత్ను పక్కన పెట్టి, కేరళ స్టార్ సంజూ శాంసన్కు వన్డేల్లో శాశ్వత చోటు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

ODI World Cup 2027: వచ్చే ఏడాది జరగబోయే వన్డే సిరీస్లు, 2027 వన్డే ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకుని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్కు దూరమైన రిషబ్ పంత్ను, ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా తప్పించాలని వారు యోచిస్తున్నారు. ఆ స్థానాన్ని అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ శాంసన్తో భర్తీ చేయడమే ఉత్తమమని మేనేజ్మెంట్ భావిస్తోంది.
సంజూ శాంసన్ ‘గోల్డెన్’ ఫామ్..
గత టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశలో అద్భుత ప్రదర్శన చేసి భారత్ ట్రోఫీ గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అదే ఊపును ఐపీఎల్ 2026లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడుతున్న సంజూ, కేవలం 8 మ్యాచ్ల్లోనే 304 పరుగులు సాధించాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం గమనార్హం. ఒత్తిడిలోనూ నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడంలో సంజూ విజయవంతమయ్యాడు.
రిషబ్ పంత్కు కలిసిరాని ఐపీఎల్ 2026..
మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ ప్రదర్శన ఈ సీజన్లో దారుణంగా ఉంది. అటు బ్యాటర్గా, ఇటు కెప్టెన్గా పంత్ విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 189 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ నేతృత్వంలోని లక్నో జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ వైఫల్యాలే పంత్ వన్డే కెరీర్కు ముప్పుగా మారాయి.
టెస్టులకే పరిమితం కానున్న పంత్?
పరిమిత ఓవర్ల క్రికెట్లో (ODI, T20) పంత్ స్థానానికి ఎసరు వచ్చినా, టెస్టు ఫార్మాట్లో మాత్రం సెలెక్టర్లు అతడిపైనే నమ్మకం ఉంచారు. టెస్టుల్లో పంత్ రికార్డులు అద్భుతంగా ఉండటంతో, అతడిని ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా కొనసాగించే అవకాశం ఉంది. అయితే, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల కోసం మాత్రం సంజూ శాంసన్నే ప్రధాన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా సిద్ధం చేయాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నారు.
భవిష్యత్తు ప్రణాళిక..
2027 వన్డే ప్రపంచ కప్ వరకు జట్టులో స్థిరత్వం ఉండాలని సెలెక్టర్లు కోరుకుంటున్నారు. రాహుల్ లేదా సంజూలలో ఒకరిని రెగ్యులర్ కీపర్గా, మరొకరిని బ్యాకప్గా ఉంచడం ద్వారా జట్టు సమతూకాన్ని కాపాడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంజూకి ఉన్న క్లీన్ హిట్టింగ్ సామర్థ్యం వన్డేల్లో మధ్య ఓవర్లలో జట్టుకు పెద్ద బలం కానుంది.
రిషబ్ పంత్ ఒక అద్భుతమైన టాలెంట్ అనడంలో సందేహం లేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంజూ శాంసన్ ఫామ్ను కాదనలేరు. సెలెక్టర్లు తీసుకునే ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తును ఎలా మలుస్తుందో చూడాలి. సంజూ శాంసన్ అభిమానులకు మాత్రం ఇది పండగ లాంటి వార్తే.!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
