Ruturaj Gaikwad : కోహ్లీ స్థానంలో రుతురాజ్ అనుకుంటే.. కట్ చేస్తే శ్రీలంకలో ల్యాండ్ అయ్యాడు! అసలేం జరుగుతోంది?
Ruturaj Gaikwad : జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు బీసీసీఐకి ఇది మంచి అవకాశం అయినప్పటికీ, కోహ్లీ గాయం వార్త ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ను పునరాలోచనలో పడేసింది.

Ruturaj Gaikwad : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య త్వరలో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్కు ముందే సెలెక్షన్ కమిటీలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కానున్నాడనే వార్తలు వస్తున్న తరుణంలో, అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు బీసీసీఐకి ఇది మంచి అవకాశం అయినప్పటికీ, కోహ్లీ గాయం వార్త ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ను పునరాలోచనలో పడేసింది.
శ్రీలంకలో ల్యాండ్ అయిన రుతురాజ్ గైక్వాడ్
విరాట్ కోహ్లీకి సరైన రీప్లేస్మెంట్గా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను సెలెక్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా రుతురాజ్ గైక్వాడ్ శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రత్యక్షమయ్యాడు. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య జరగబోయే ముక్కోణపు సిరీస్ లో పాల్గొనేందుకు అతడు ఇండియా-ఎ జట్టుతో కలిశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. రుతురాజ్ శ్రీలంక టూర్లో బిజీగా ఉండటంతో, ఇక అఫ్గాన్ వన్డే సిరీస్లోకి అతడిని తీసుకునే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
కోహ్లీకి అయిన గాయం ఏంటి? ఎప్పుడు జరిగింది?
విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున గుజరాత్ టైటాన్స్తో జరిగిన రన్చేజ్లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. అయితే, ఆ సమయంలో బాగానే కనిపించినా, ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో అతనికి తీవ్రమైన హ్యామ్స్ట్రింగ్ గాయమైనట్లు తేలింది. మోకాలి వెనుక భాగంలో ఉండే టెండన్ దెబ్బతినడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే గాయం కావడం గమనార్హం. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, కోహ్లీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.
కోహ్లీ ప్లేస్లోకి వచ్చే ఆ ఇద్దరు రేసర్లు వీరే
గాయపడిన రియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-ఎ జట్టులోకి వెళ్లడంతో.. ఇప్పుడు అఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్ కోసం సెలెక్టర్లు వేరే ఆప్షన్లను వెతుకుతున్నారు. ఈ రేసులో దేవదత్ పడిక్కల్ పేరు బలంగా వినిపిస్తోంది. లిస్ట్-ఎ క్రికెట్లో పడిక్కల్ 42 మ్యాచ్లలో ఏకంగా 82.23 సగటుతో 2,796 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అతనితో పాటు ఐపీఎల్ 2026లో దుమ్మురేపిన రజత్ పటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉంది. పటీదార్ 77 లిస్ట్-ఎ మ్యాచ్లలో 99.17 స్ట్రైక్ రేట్తో 2,278 పరుగులు చేశాడు. ఒకవేళ కోహ్లీ సిరీస్ మధ్యలో కోలుకుంటే వచ్చేస్తాడని, లేదంటే వీరిద్దరిలో ఒకరికి లక్కీ ఛాన్స్ దక్కుతుందని సమాచారం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
