Virat Rohit : వరల్డ్ కప్ ఆడాలంటే అలా చేయాల్సిందే.. కోహ్లీ, రోహిత్లకు గట్టి షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు దేశీయ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. వన్డే ఫార్మాట్ కోసం టీమిండియాలో చోటు సంపాదించాలంటే, వారు దేశీయ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని బోర్డు స్పష్టం చేసింది.

Virat Rohit : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు దేశీయ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. వన్డే ఫార్మాట్ కోసం టీమిండియాలో చోటు సంపాదించాలంటే, వారు దేశీయ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఆదేశం తర్వాత బీసీసీఐ సూచన మేరకు రోహిత్ శర్మ ఈ టోర్నమెంట్లో ఆడటానికి అంగీకరించాడని, ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్కు కూడా తెలియజేశాడని ఒక నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఎంసీఏ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. రోహిత్ శర్మ తమకు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని వెల్లడైంది.
కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్తో భారత జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ దృష్టి 2027 వరల్డ్ కప్ పై ఉంది. దీని గురించి అతను గతంలో అనేకసార్లు మాట్లాడాడు. అయితే రోహిత్ వయస్సు పెరుగుతున్నందున, ఇటీవలి కాలంలో అతని ప్రదర్శన అంత గొప్పగా లేనందున బీసీసీఐ, ప్రస్తుత టీమ్ మేనేజ్మెంట్ దీనిపై అంతగా నమ్మకంగా లేవు. కానీ, ఆస్ట్రేలియా పర్యటనలో ఒక సెంచరీతో సహా అత్యధిక పరుగులు సాధించి, తాను ఇంకా పూర్తి ఫామ్లో ఉన్నానని రోహిత్ నిరూపించుకున్నాడు.
అయినప్పటికీ బీసీసీఐ రోహిత్, విరాట్లకు మ్యాచ్ ఫిట్గా ఉండటానికి దేశీయ క్రికెట్ ఆడాలని క్లియర్ మెసేజ్ పంపింది. దీనిని దృష్టిలో ఉంచుకొని, రోహిత్ ఎంసీఏకు తాను విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటానని చెప్పాడని ఒక నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఎంసీఏ చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాడు. పాటిల్ మాట్లాడుతూ..”నాకు ఇంకా రోహిత్ శర్మ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. ఒకవేళ అతను ముంబై తరఫున ఆడితే, అది మాకు చాలా మంచిది. యువ ఆటగాళ్లకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బీసీసీఐ, అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ లు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది” అని అన్నారు.
రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడతాడా లేదా అనే విషయం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 24 నుంచి జనవరి 11, 2026 వరకు జరగనుంది. కాబట్టి, నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్పై దీని ప్రభావం ఉండకూడదు. అయితే, ఈ వన్డే సిరీస్కు సరిగ్గా ముందు, నవంబర్ 26 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రెండు దిగ్గజాలు వన్డే సిరీస్ సెలక్షన్ కోసం ఈ టోర్నమెంట్లో కూడా ఆడాల్సి వస్తుందా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




