AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RO-KO : లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. హిస్టరీ క్రియేట్ చేయబోతున్న రోకో

RO-KO : లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నారు. భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించనున్న రో-కో జోడీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్ణయాత్మక వన్డేలో ఇద్దరూ రాణించాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RO-KO : లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. హిస్టరీ క్రియేట్ చేయబోతున్న రోకో
Roko
Rakesh
|

Updated on: Jul 19, 2026 | 11:39 AM

Share

RO-KO : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డే జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సిరీస్ విజయంపై ఎంత ఉత్కంఠ ఉందో, భారత ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సృష్టించబోయే రికార్డుపై కూడా అంతే ఆసక్తి నెలకొంది. నేడు వీరిద్దరూ కలిసి మైదానంలోకి అడుగుపెట్టడమే తరువాయి అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సరికొత్త మైలురాయిని అందుకోనున్నారు. ఈ మ్యాచ్ ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు భారత జర్సీలో కలిసి ఆడుతున్న 400వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో కలిసి 400వ మ్యాచ్

క్రికెట్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు కలిసి 400 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన రికార్డు జాబితాలో ఇప్పటివరకు భారతదేశం పేరు నమోదు కాలేదు. కానీ నేటి మ్యాచ్‌తో భారత్ కూడా ఆ ప్రత్యేకమైన క్లబ్‌లో అధికారికంగా చేరిపోనుంది. రోహిత్, కోహ్లీ జోడీ ఇప్పటివరకు టీమిండియా తరఫున కలిసి 399 అంతర్జాతీయ మ్యాచ్‌లు (టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నీ కలిపి) ఆడారు. భారతదేశం తరఫున ఒక జోడీగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఇప్పటికే వీరి పేరిటే ఉంది. వీరి తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ జోడీ కలిసి 391 మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో ఉన్నారు.

టాప్-5లో శ్రీలంక ప్లేయర్ల హవా

ప్రపంచ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. ఒక జోడీగా అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వరల్డ్ రికార్డు శ్రీలంక లెజెండ్స్ కుమార సంగక్కర, మహేల జయవర్ధనే పేరిట ఉంది. వీరిద్దరూ కలిసి శ్రీలంక జట్టు తరఫున ఏకంగా 550 మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలోని టాప్-5 స్థానాలలో నాలుగు జోడీలు శ్రీలంక దేశానికి చెందినవే ఉండటం విశేషం. సంగక్కర-జయవర్ధనే తర్వాత తిలకరత్నే దిల్షాన్-జయవర్ధనే (426 మ్యాచ్‌లు), సంగక్కర-దిల్షాన్ (418 మ్యాచ్‌లు), సనత్ జయసూర్య-ముత్తయ్య మురళీధరన్ (408 మ్యాచ్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన జాక్వస్ కలిస్, మార్క్ బౌచర్ (407 మ్యాచ్‌లు) జోడీ ఉండగా, మన రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ జోడీ ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది.

రిటైర్మెంట్ పుకార్లపై బీసీసీఐ క్లారిటీ

ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. ఆడిన రెండు వన్డే మ్యాచ్‌లలోనూ ఆయన పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. మొదటి వన్డేలో 11 పరుగులు చేసిన రోహిత్, రెండో వన్డేలో 26 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక్కడ స్కోరు కంటే కూడా ఆయన ఆడిన స్ట్రైక్ రేట్ అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రెండో మ్యాచ్‌లో 26 పరుగులు చేయడానికి ఆయన ఏకంగా 47 బంతులు తీసుకున్నారు. ఇందులో కేవలం ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫామ్ లేమి కారణంగా రోహిత్ వన్డే రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు రాగా, బీసీసీఐ వాటిని పూర్తిగా కొట్టిపారేసింది. నేటి చారిత్రాత్మక మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

లార్డ్స్ మైదానంలో సెంచరీ కరవు తీర్చేనా?

మరోవైపు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో చక్కటి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ ఒత్తిడిలో 65 పరుగుల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లార్డ్స్ మైదానంలో భారత్‌కు సెంచరీల రికార్డు కాస్త బలహీనంగా ఉన్న నేపథ్యంలో, నేటి నిర్ణయాత్మక మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ బ్యాట్ నుంచి ఒక అద్భుతమైన సెంచరీ రావాలని, తద్వారా భారత్ సిరీస్ గెలవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తే భారత్‌కు విజయం సులువవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us