RCB విక్టరీ సెలబ్రేషన్స్లో తొక్కిసలాట 11 మంది మృతి! క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం DK
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ విజయోత్సవంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తీవ్రమైన తొక్కిసలాట సంభవించింది. అభిమానుల తోక్కిసలాటలో 11 మంది మరణించారు, మరికొందరు గాయపడ్డారు. కర్ణాటక డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పగా, సీఎం గాయపడ్డవారిని పరామర్శించారు. ఈ ఘటన బెంగళూరులో విషాదాన్ని నింపింది.

ఆర్సీబీ విజయోత్సవంలో మాత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం అహ్మాదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించి.. ఛాంపియన్గా నిలిచింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వారికి ఇదే తొలి కప్పు. దీంతో ఆర్సీబీ టీమ్తో పాటు వారి అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఐపీఎల్లో అన్ని టీమ్స్ కంటే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ కప్పు గెలవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ముందుగా విధాన సౌధాకు వెళ్లి అక్కడ సీఎం సిద్ధరామయ్యను కలిసి, అక్కడి నుంచి విక్టరీ పరేడ్ నిర్వహిస్తూ.. ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి చేరుకోవాలని ప్లాన్ చేశారు. కానీ, పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. కానీ, స్టేడియంలో సెలబ్రేషన్స్కు పర్మిషన్ ఇచ్చారు. అయితే అభిమానులు భారీ ఎత్తున తరలిరావడం, స్టేడియంలోకి గోడలు, బారిగేట్లు దొకి వెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని సమాచారం.
ఈ ఘటనలో ఇప్పటికే 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. తాము అభిమానులను అదుపుచేయలేకపోయామని, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. అలాగే సీఎం సిద్ధరామయ్య ఈ తొక్కిసలాటలో గాయపడిన వారు చికిత్స పొందుతున్న బౌరింగ్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.




