AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT, IPL 2022 Match: మళ్లీ మెరిసిన శుభ్‌మన్‌.. తెవాతియా ధనాధన్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం..

PBKS vs GT, IPL 2022: ఐపీఎల్‌ సీజన్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ వరుసగా విజయాలు సాధిస్తోంది. శుక్రవారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.

PBKS vs GT, IPL 2022 Match: మళ్లీ మెరిసిన శుభ్‌మన్‌.. తెవాతియా ధనాధన్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం..
Gujarat Titans
Basha Shek
|

Updated on: Apr 09, 2022 | 12:36 AM

Share

PBKS vs GT, IPL 2022: ఐపీఎల్‌ సీజన్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ వరుసగా విజయాలు సాధిస్తోంది. శుక్రవారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని హార్దిక్‌ సేన సరిగ్గా  చివరి బంతికి విజయాన్ని  అందుకుంది. శుభ్‌మన్‌ (96) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోగా రాహుల్ తెవాతియా చివరి రెండు బంతుల్లో రెండు అద్భుతమైన సిక్సర్లు కొట్టి గుజరాత్‌ విజయాన్ని ఖరారు చేశాడు. హార్దిక్‌ పాండ్యా (27) రాణించారు. దీంతో ఈ టోర్నీలో గుజరాత్‌ ముచ్చటగా మూడో విజయం సాధించగా.. నాలుగు మ్యాచ్‌ల్లో పంజాబ్ రెండో ఓటమిని చవిచూసింది. కాగా గుజరాత్‌ విజయానికి చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా, డేవిడ్ మిల్లర్‌తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడు. ఒడియన్ స్మిత్ తొలి బంతికే హార్దిక్ రనౌట్ కాగా, క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాతియా తర్వాతి బంతికి ఒక రన్‌ తీశాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ఫోర్ కొట్టాడు. అయితే దీని తర్వాత స్మిత్ పెద్ద తప్పిదం చేశాడు. అతను మిల్లర్‌కి మంచి బాల్‌ వేసినా ఓవర్‌ త్రో చేయడంతో రెండు పరుగులు వచ్చాయి. దీంతో చివరి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. గతంలో ఎన్నోసార్లు మెరపు బ్యాటింగ్ తో అదరగొట్టిన తెవాతియా చివరి రెండు బంతులను నేరుగా స్టేడియంలోకి పంపి తన జట్టుకు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సూపర్‌ ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్న శుభమన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది.

లివింగ్‌ స్టోన్‌ మరోసారి..

కాగా ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది పంజాబ్‌. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. భానుక రాజపక్సే స్థానంలో జట్టులోకి వచ్చిన జానీ బెయిర్‌స్టో కూడా నిరాశపర్చాడు. అయితే గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అర్ధ సెంచరీ చేసిన లివింగ్‌స్టన్ మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 27 బంతుల్లో 64 పరుగులు (7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేశాడు. ధావన్ మరోసారి శుభారంభం చేసినా వేగంగా పరుగులు చేయలేకపోయాడు. ఇక16వ ఓవర్‌లో లివింగ్‌స్టన్‌ రషీద్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 153 పరుగులు మాత్రమే. జితేష్ శర్మ (11 బంతుల్లో 23 పరుగులు) రాహుల్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో స్కోరు వేగం పెరిగింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు వేగంగా ఆడకపోవడంతో స్కోరుబోర్డు ముందుకు కదలలేదు. అయితే రాహుల్ చాహర్ (14 బంతుల్లో 22 నాటౌట్, రెండు ఫోర్లు, ఒక సిక్స్), 11వ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ (5 బంతుల్లో 10 నాటౌట్) ధాటిగా ఆడడంతో పంజాబ్‌ 189 పరుగుల భారీస్కోరు సాధించింది. గుజరాత్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (22/3) పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

Also Read: Bhadradri Kothagudem: భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. కాల్పులు జరిపిన పోలీసులు

Income Tax: కేంద్ర ప్రభుత్వ అంచనాలను మించిన పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..

RRR Movie: టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్లను దాటేస్తూ..