AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs SAW: డబ్బులివ్వరు.. నేల మీదే నిద్ర.. భారత మహిళల క్రికెట్ ప్రస్థానం తెలిస్తే కన్నీళ్లు ఆగవంతే..

Team India Women's Cricket: ఒకప్పుడు రైలు ప్రయాణాలు, కనీస వసతులు లేక ఇబ్బంది పడిన క్రికెటర్ల పోరాట ఫలితమే నేటి హర్మన్‌ప్రీత్ సేన సాధించిన విజయం. ఈ తరం క్రీడాకారిణులు అనుభవిస్తున్న అన్ని సౌకర్యాల వెనుక, నాటి శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, నూతన్ గావస్కర్ వంటి ఎందరో పాతతరం క్రీడాకారుల త్యాగం ఉంది.

INDW vs SAW: డబ్బులివ్వరు.. నేల మీదే నిద్ర.. భారత మహిళల క్రికెట్ ప్రస్థానం తెలిస్తే కన్నీళ్లు ఆగవంతే..
Indw Vs Saw Final
Venkata Chari
|

Updated on: Nov 02, 2025 | 11:46 AM

Share

India Women vs South Africa Women, Final: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నేడు (నవంబర్ 2, 2025) ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా నేడు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. కానీ, నేడు కోట్లాది అభిమానులను, కోట్ల ప్రైజ్ మనీని చూస్తున్న ఈ మహిళల క్రికెట్ జట్టు వెనుక.. కొన్ని దశాబ్దాల పాటు ఎవరూ చూడని కన్నీళ్లు, కష్టాల పోరాటం దాగి ఉంది.

ఒకప్పుడు కనీస వసతులు కూడా లేని స్థితి నుంచి నేడు ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదిగిన భారత మహిళల క్రికెట్ జట్టు పయనం గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఆదిలో మహిళా క్రికెటర్ల కఠోర వాస్తవాలు..

భారత మహిళా క్రికెట్ అసోసియేషన్ (WCAI) బీసీసీఐలో విలీనం కావడానికి (2006కు ముందు) ముందు.. పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది.

డబ్బు లేదు, రైలు ప్రయాణాలే ఆధారం: మ్యాచ్ ఫీజు అనేది ఒకప్పుడు కలలో కూడా లేని విషయం. టోర్నమెంట్‌లకు వెళ్లడానికి మహిళా క్రికెటర్లు 36 నుంచి 48 గంటలు రైళ్లలో ప్రయాణించేవారు. ఈ ప్రయాణాలకు కూడా సాధారణ కంపార్ట్‌మెంట్‌లలో టికెట్లు కొనుక్కునేవారు.

నేల మీదే నిద్ర, దుప్పట్లూ వారే తెచ్చుకోవాలి: ఆటగాళ్లకు మంచి వసతి దొరకడం అనేది ఒక అద్భుతం. చాలా టోర్నమెంట్‌లలో, ఒకే డార్మిటరీలో 20 మందికి పైగా ఉండేవారు. నేల మీదే పడుకోవడానికి సొంతంగా దుప్పట్లను, పరుపులను మోసుకువెళ్లాల్సి వచ్చేది.

20 మందికి 4 టాయిలెట్లు: మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి వంటి దిగ్గజాలు పంచుకున్న అనుభవాల ప్రకారం, 20 మంది జట్టు సభ్యుల కోసం కేవలం నాలుగు టాయిలెట్లు మాత్రమే ఉండేవి. అవి కూడా శుభ్రంగా ఉండేవి కావు.

ప్లాస్టిక్ పాత్రల్లో పప్పు: టోర్నమెంట్‌లను తక్కువ బడ్జెట్‌తో నిర్వహించడం వల్ల, భోజనం కూడా నాణ్యతగా ఉండేది కాదు. స్థానిక అసోసియేషన్లు పెద్ద ప్లాస్టిక్ పాత్రల్లో పప్పు లేదా కూరలను వడ్డించేవని ఆటగాళ్లు గుర్తు చేసుకున్నారు.

ఒకే కిట్ పంచుకోవడం: క్రికెట్ కిట్ కొనుక్కోవడం ఒక లగ్జరీగా భావించేవారు. ఒక ఓపెనర్ అవుట్ అయితే, ఆమె బ్యాట్‌, లెగ్ గార్డ్స్‌‌ను తదుపరి బ్యాటర్ ఉపయోగించేది.

2006 తర్వాత బీసీసీఐ విలీనం: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మహిళల క్రికెట్‌ను తన పరిధిలోకి తీసుకున్న తర్వాత ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు మొదలైంది.

మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి యుగం: మిథాలీ, ఝులన్ వంటి దిగ్గజాలు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించడం వల్ల జట్టుకు గుర్తింపు పెరిగింది. 2005, 2017 ప్రపంచ కప్ ఫైనల్స్‌కు భారత్ చేరడం, మహిళల క్రికెట్‌కు ఒక కొత్త అస్తిత్వాన్ని ఇచ్చింది.

ప్రొఫెషనలిజం పెరుగుదల: గత దశాబ్దంలో మెరుగైన శిక్షణ సౌకర్యాలు, కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు పెరిగాయి. ఫిట్‌నెస్ స్థాయిలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

డబ్ల్యూపీఎల్ (WPL) ప్రభావం: బీసీసీఐ ప్రారంభించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) భారత మహిళల క్రికెట్ దశనే మార్చివేసింది. యువ ప్రతిభకు వేదిక దొరికింది. ఆర్థికంగా, ప్రొఫెషనల్‌గా క్రికెటర్లకు స్థిరత్వం లభించింది.

నేడు చరిత్ర సృష్టించే అవకాశం..

ఒకప్పుడు రైలు ప్రయాణాలు, కనీస వసతులు లేక ఇబ్బంది పడిన క్రికెటర్ల పోరాట ఫలితమే నేటి హర్మన్‌ప్రీత్ సేన సాధించిన విజయం. ఈ తరం క్రీడాకారిణులు అనుభవిస్తున్న అన్ని సౌకర్యాల వెనుక, నాటి శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, నూతన్ గావస్కర్ వంటి ఎందరో పాతతరం క్రీడాకారుల త్యాగం ఉంది.

నేడు, 1983లో పురుషుల జట్టు విజయం పురుషుల క్రికెట్‌ను ఎలా మార్చిందో, అదే తరహాలో నేటి ప్రపంచ కప్ విజయం భారత మహిళా క్రికెట్ రూపురేఖలను పూర్తిగా మార్చగలదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు విజయం సాధిస్తే, దేశంలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య రెట్టింపు అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

“గెలిస్తే కప్పు మనదే, లేదంటే ఈ పోరాటమే చాంపియన్‌షిప్‌” అని పాతతరం క్రీడాకారులు చెప్పిన మాట, నేటి విజయాల వెనుక ఉన్న అసలు స్ఫూర్తిని తెలియజేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us