
లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో..16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. ముంబయి పేసర్ ఆకాశ్ మధ్వాల్ (5/5) సంచలన బౌలింగ్తో లక్నోకు చెమటలు పట్టించాడు. ముంబయి బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (41; 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (33; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. చివర్లో నేహల్ వధేరా (23; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. తిలక్ వర్మ (26; 22 బంతుల్లో 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. అలాగే ఇషాన్ కిషన్ (15), రోహిత్ శర్మ (11), టిమ్ డేవిడ్ (13) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 4, యశ్ ఠాకూర్ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. మోసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
అయితే లక్నో బ్యాటింగ్ చేస్తుండగా కీలక సమయంలో రనౌట్లూ కొంపముంచాయి. స్టాయినిస్ (40) టాప్ స్కోరర్. కైల్ మేయర్స్ (18), దీపక్ హుడా (15) పరుగులు చేయగా.. మిగిలిన ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అయితే భారీ విజయాన్ని అందుకున్న ముంబయి ఇండియన్స్.. ఫైనల్స్ రెండో బెర్తు కోసం శుక్రవారం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ను ఢీకొట్టనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో చైన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..