AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: టీమిండియాలోకి మహమ్మద్ షమీ రీఎంట్రీ?.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌పైనే సెలెక్టర్ల కన్ను

Mohammed Shami: వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు టీమిండియాలోకి మహమ్మద్ షమీ రీఎంట్రీపై సెలెక్టర్ల దృష్టి పడింది. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున షమీ ప్రదర్శన కీలకంగా మారింది. మ్యాచ్‌లో భారీ స్పెల్స్‌తో ఆకట్టుకుంటే జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు పెరగనున్నాయి.

Mohammed Shami: టీమిండియాలోకి మహమ్మద్ షమీ రీఎంట్రీ?.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌పైనే సెలెక్టర్ల కన్ను
Mohammed Shami (1)
Rakesh
|

Updated on: Sep 06, 2026 | 12:20 PM

Share

Mohammed Shami: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డే జట్టులోకి రీఎంట్రీకి సర్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేసే క్రమంలో సెలెక్టర్లు షమీ పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్) ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే భారత టీ20 జట్టులో ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా భాగం కానున్నారు. అదే సమయంలో సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో భారత వన్డే సిరీస్ మొదలవుతుంది. బుమ్రా, అర్ష్‌దీప్ వంటి కీలక బౌలర్లు జపాన్‌లో ఉండే అవకాశం ఉండటంతో, విండీస్ వన్డే సిరీస్ కోసం భారత సెలెక్టర్లు ప్రత్యామ్నాయ పేస్ బౌలింగ్ వనరుల వేటలో పడ్డారు.

వెస్టిండీస్ సిరీస్‌కు సంబంధించి వేగవంతమైన బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించే అవకాశం ఉంది. అతనితో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకవేళ జట్టులో నలుగురు పేసర్లను తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తే మహమ్మద్ షమీ వైపే మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుమ్రా లేని లోటును భర్తీ చేయాలంటే అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న షమీ జట్టుకు కొండంత అండగా నిలుస్తాడు. కష్టసమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతడికి సొంతం.

గత కొంతకాలంగా షమీ ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం లాంగ్ ఫార్మాట్‌కు షమీ ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడనే విషయంపై బహిరంగంగానే మాట్లాడారు. ఈ విమర్శలన్నింటికీ షమీ తన బౌలింగ్‌తోనే ధీటైన సమాధానమిచ్చాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన అతడు సుదీర్ఘమైన స్పెల్స్ వేస్తూ తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను చాటుకున్నాడు.

సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు జరగనున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ షమీ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈస్ట్ జోన్ తరఫున ఫైనల్లో బరిలోకి దిగుతున్న షమీ ప్రదర్శనపై జాతీయ సెలెక్టర్ల కన్ను పడింది. ఈ మ్యాచ్‌లో గనుక అతడు భారీ స్పెల్స్ వేసి వికెట్లు పడగొడితే, సెలెక్షన్ కమిటీ అతడి ఎంపికపై సానుకూల నిర్ణయం తీసుకోక తప్పదు. భారత జట్టులో మళ్లీ చోటు సంపాదించడానికి ఈ ఫైనల్ పోరు అతడికి ఒక బ్రేక్‌త్రూ మ్యాచ్‌గా మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us