కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే.. బ్యాడ్‌లక్ దెబ్బకు కనిపించకుండా పోయాడుగా

Indian Cricket Forgotten Stars: భారత క్రికెట్ చరిత్రలో ఎందరో ప్రతిభావంతులు వచ్చి వెళ్తుంటారు. కానీ ఒకప్పుడు సాక్షాత్తూ విరాట్ కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా ముద్ర వేయించుకుని, నేడు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఒక క్రికెటర్ కథ ఇది. కేవలం 19 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించిన ఆ ఆటగాడి పతనం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

కోహ్లీ కంటే తోపుగాడు.. 19 ఏళ్లకే ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే.. బ్యాడ్‌లక్ దెబ్బకు కనిపించకుండా పోయాడుగా
Virat Kohli Vs Manish Pandey

Updated on: Apr 29, 2026 | 5:48 PM

Virat Kohli vs Manish Pandey: ఇండియన్  ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ రోజుల్లో ఒక కుర్రాడు మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. 2008లో అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ఆ సమయంలో అందరి దృష్టి మనీష్ పాండే అనే యువ ఆటగాడిపైనే ఉండేది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ సాధించి, ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అప్పట్లో అతని ఆట తీరు చూసి కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ఇతనే ముందు వరుసలో ఉంటాడని విశ్లేషకులు భావించారు.

ప్రతిభ ఉన్నా అందని అదృష్టం..

మనీష్ పాండే కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం అతని నిలకడలేని ఆట తీరు. కొన్ని మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించినా, కీలకమైన టోర్నమెంట్లలో వరుసగా విఫలం కావడం అతనిపై ఒత్తిడి పెంచింది. భారత జట్టులో ఎంపికైనప్పటికీ, తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం తక్కువగానే వచ్చేది. గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు; అతను దాదాపు 73 వన్డే మ్యాచ్‌ల స్క్వాడ్‌లో ఎంపికైనప్పటికీ, తుది జట్టులో ఆడింది మాత్రం కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే.

గాయాలే కాదు గట్టి పోటీ..!

అతను తన ఆటలో అత్యున్నత దశలో ఉన్నప్పుడు తగిలిన గాయాలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకుని అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగారు. జట్టులో విపరీతమైన పోటీ పెరగడం, యువ ఆటగాళ్లు దూసుకురావడంతో మనీష్ పాండే మెల్లగా సెలెక్టర్ల దృష్టి నుంచి కనుమరుగయ్యాడు.

ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాడు?

ఒకప్పుడు జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న మనీష్ పాండే, ఇప్పుడు కేవలం ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిగా మాత్రమే మిగిలిపోవడం అభిమానులను కలిచివేస్తోంది. మైదానంలో ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే సబ్స్టిట్యూట్‌గా రావడం చూసి అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అతను దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా, జాతీయ జట్టులోకి తిరిగి రావడం ఒక సవాలుగానే మారింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us