ఐపీఎల్ హిస్టరీలో వింత రికార్డ్.. ఒక్కబంతి వేయకుండానే మ్యాచ్‌ క్లోజ్.. 18 ఏళ్లలో 2సార్లు ఇలా..?

IPL History No Spin Matches: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల విధ్వంసం, స్పిన్నర్ల మాయాజాలం. కానీ 18 ఏళ్ల ఈ మెగా టోర్నీ చరిత్రలో స్పిన్నర్లు ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్‌లు ముగిశాయంటే నమ్ముతారా..? తాజాగా ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో అచ్చం ఇలాంటి అరుదైన దృశ్యమే ఆవిష్కృతమై క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఐపీఎల్ హిస్టరీలో వింత రికార్డ్.. ఒక్కబంతి వేయకుండానే మ్యాచ్‌ క్లోజ్.. 18 ఏళ్లలో 2సార్లు ఇలా..?
Ipl History No Spin Matches

Updated on: May 12, 2026 | 5:33 PM

IPL History No Spin Matches: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మే 11న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక వింత రికార్డును నమోదు చేసింది. సాధారణంగా ఏ టీమ్ అయినా కనీసం ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు స్పిన్నర్లకు బంతిని అందించలేదు. మ్యాచ్ మొత్తం కేవలం ఫాస్ట్ బౌలర్లతోనే సాగడం విశేషం.

10 మంది బౌలర్లు.. 39 ఓవర్లు.. 0 స్పిన్..!

ఈ పోరులో పంజాబ్, ఢిల్లీ జట్లు కలిపి మొత్తం 10 మంది బౌలర్లను ప్రయోగించాయి. ఇరు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 39 ఓవర్ల పాటు ఆట సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ 10 మంది బౌలర్లలో ఒక్కరు కూడా స్పిన్నర్ లేకపోవడం. మైదానంలోని వాతావరణ పరిస్థితులు, పిచ్ పేసర్లకు అనుకూలించడంతో కెప్టెన్లు పూర్తిగా వేగవంతమైన బౌలర్లనే నమ్ముకున్నారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్వయంగా స్పిన్నర్ అయినప్పటికీ, ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా ఆయన కూడా బంతిని చేతపట్టలేదు.

18 ఏళ్ల క్రితం తొలిసారి: చెన్నై వర్సెస్ బెంగళూరు..

ఐపీఎల్ చరిత్రలో ఇలా స్పిన్నర్లు లేకుండా మ్యాచ్ జరగడం ఇది రెండోసారి మాత్రమే. దీనికి ముందు తొలి సీజన్ అంటే 2008లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏప్రిల్ 28, 2008న బెంగళూరు వేదికగా జరిగిన ఆ పోరులో కూడా ఇరు జట్లు కలిపి 10 మంది బౌలర్లను వాడగా, అందరూ పేసర్లే కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో మొత్తం 39.4 ఓవర్లు పడగా, ఒక్క బంతి కూడా స్పిన్ కాలేదు.

కారణం ఏమిటి..?

స్పిన్నర్లకు బంతిని ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణం, పిచ్ స్వభావం. ధర్మశాల వంటి మైదానాల్లో చల్లని గాలులు, గడ్డితో కూడిన పిచ్‌లు పేసర్లకు అదనపు బలాన్ని ఇస్తాయి. బంతి గాలిలో స్వింగ్ అవ్వడం, సీమ్ మూవ్‌మెంట్ లభించడంతో కెప్టెన్లు స్పిన్నర్ల కంటే వేగవంతమైన బౌలర్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఇలాంటి సంఘటనలు కేవలం రెండుసార్లు మాత్రమే జరగడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us