
Riyan Parag Comments on Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పర్యాయపదంగా మారిన సంజూ శాంసన్, ఈ సీజన్లో పింక్ జెర్సీలో కనిపించకపోవడం అభిమానులకు మింగుడుపడని విషయమే. ఐదేళ్ల పాటు కెప్టెన్గా, 11 ఏళ్ల పాటు కీలక ఆటగాడిగా జట్టును నడిపించిన శాంసన్ నిష్క్రమణపై రియాన్ పరాగ్ భావోద్వేగంగా మాట్లాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎలాగైతే ఎవరూ భర్తీ చేయలేరో, సంజూ భయ్యా స్థానం కూడా అంతేనని పేర్కొన్నాడు.
2008 ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్, గత డిసెంబర్ మినీ వేలానికి ముందు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రవీంద్ర జడేజాతో ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు పంపింది. 2021 నుంచి 2025 వరకు కెప్టెన్గా వ్యవహరించిన శాంసన్, 155 మ్యాచ్ల్లో 4,219 పరుగులతో ఆ జట్టు ఆల్-టైమ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. 2022లో జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనదే.
ప్రీ-సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. “మేం సంజూ భయ్యా స్థానాన్ని భర్తీ చేయాలని అస్సలు అనుకోవడం లేదు. అది అసాధ్యమైన పని. ఆయన స్థానంలో మరొకరిని ఆడించవచ్చు లేదా అలాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడి కోసం వెతకవచ్చు కానీ, శాంసన్ను రీప్లేస్ చేయలేం” అని స్పష్టం చేశాడు. మార్చి 30న గువహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తొలి మ్యాచ్లోనే పరాగ్ తన మాజీ కెప్టెన్ సంజూను ఎదుర్కోబోతున్నాడు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా మూడు అర్ధసెంచరీలతో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. ఇటువంటి స్టార్ ఫామ్లో ఉన్న ఆటగాడు జట్టును వీడటం రాజస్థాన్ రాయల్స్కు పెద్ద ఎదురుదెబ్బే. గత సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైన రాయల్స్, ఈసారి పరాగ్ నేతృత్వంలో కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..