India Vs New Zealand: ఇప్పటి వరకు ధోనీ, కోహ్లీ చేయలేని పని రోహిత్ చేయనున్నాడా.. అదేంటంటే?
ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. కివీస్పై భారత గడ్డపై తొలిసారిగా రోహిత్ అండ్ కో క్లీన్ స్వీప్ చేస్తుంది. భారత్లో న్యూజిలాండ్ను టీమ్ఇండియా గతంలో ఎన్నడూ ఇలా ఓడించలేకపోయింది.

India Vs New Zealand: ఈరోజు కోల్కతా వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్ల్లో భారత్పై న్యూజిలాండ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. కివీస్పై భారత గడ్డపై తొలిసారిగా రోహిత్ అండ్ కో క్లీన్ స్వీప్ చేస్తుంది. భారత్లో న్యూజిలాండ్ను టీమ్ఇండియా గతంలో ఎన్నడూ ఇలా ఓడించలేకపోయింది.
ధోనీ-విరాట్లను రోహిత్ అధిగమించనున్నాడా..! ఇది భారత గడ్డపై భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడవ సిరీస్. 2012లో తొలిసారిగా ఇరు దేశాల మధ్య స్వదేశంలో సిరీస్ జరిగింది. ఆ సమయంలో MS ధోని జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో కివీ జట్టు 1-0తో భారత్ను ఓడించింది. మరోమారు 2017లో టీం ఇండియా 3 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ను 2-1 తేడాతో ఓడించింది. భారత్ సిరీస్ గెలిచింది. కానీ, జట్టు క్లీన్ స్వీప్ చేసే అవకాశం కోల్పోయింది. ఈసారి రోహిత్ శర్మ నేతృత్వంలోని ‘మ్యాన్ ఇన్ బ్లూ’ జట్టు న్యూజిలాండ్పై క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
బెంచ్ను పరీక్షించే అవకాశం.. జైపూర్లో 5 వికెట్లు, రాంచీలో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమ్ ఇండియా నేటి మ్యాచ్లో బెంచ్ బలాన్ని పరీక్షించే ఛాన్స్ ఉంది. నేటి మ్యాచ్లో రితురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్లకు అవకాశం దక్కవచ్చు. ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రీతురాజ్కు ఓపెనింగ్లో కేఎల్ రాహుల్ స్థానంలో అవకాశం ఇవ్వవచ్చు. అదే సమయంలో అక్షర్ లేదా అశ్విన్ స్థానాన్ని చాహల్ తీసుకోవచ్చు. నిరంతరం ఆడుతున్న రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్కు అవకాశం ఇవ్వగా, దీపక్ చాహర్ లేదా భువనేశ్వర్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ రావచ్చు.
న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. మొదటి రెండు మ్యాచ్లలో చాలా నిరాశపరిచారు. మిడిలార్డర్ వైఫల్యం కూడా ఆ జట్టు సిరీస్ కోల్పోవడానికి ప్రధాన కారణం. మార్టిన్ గప్టిల్ తప్ప బ్యాటింగ్లో జైపూర్, రాంచీలలో ఏ ఆటగాడు కూడా రాణించలేకపోయాడు. రెండో మ్యాచ్లో జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఆరంభం లభించింది. కానీ, ఎవరూ వాటిని పెద్ద ఇన్నింగ్స్లుగా మార్చలేకపోయారు. దీంతో పాటు బౌలింగ్లోనూ ఆ జట్టు తేలిపోయింది. చివరి మ్యాచ్లో జట్టు ప్రతి విభాగంలోనూ రాణించి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు.
