ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. కెప్టెన్గా బ్యాడ్లక్కోడు.. ఆ స్టార్ ప్లేయర్లపై వేటు?
ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు ఆయిర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ నెలలో జరగనున్న ఈ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ వినూత్న నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును సిద్ధం చేసినట్లు సమాచారం.

భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ జూన్ చివరలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న జరగనున్నాయి. సమయాభావం కారణంగా కేవలం రెండు మ్యాచ్లకే ఈ సిరీస్ను పరిమితం చేశారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సూర్యకుమార్, సిరాజ్లపై వేటు.. రింకూకు విశ్రాంతి
ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో లేకపోవడం. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో సూర్య 10 ఇన్నింగ్స్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి ఫామ్ కోల్పోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. మరోవైపు, మొహమ్మద్ సిరాజ్, రింకూ సింగ్లకు రాబోయే ఇంగ్లాండ్ పర్యటన దృష్ట్యా విశ్రాంతి కల్పించారు. వీరు ప్రస్తుతం ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో, వారిని తదుపరి పెద్ద సిరీస్ల కోసం తాజాగా ఉంచాలని బోర్డు యోచిస్తోంది.
సారథిగా సంజూ శామ్సన్.. కొత్త శకానికి నాంది
ఈ సిరీస్లో టీమ్ ఇండియాకు సంజూ శామ్సన్ నాయకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఐపీఎల్లో తన మార్క్ చూపించిన సంజూపై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్లో రెండు సెంచరీలతో భీకర ఫామ్లో ఉండటం అతడికి కలిసొచ్చింది. భవిష్యత్తు టీ20 కెప్టెన్గా సంజూను తీర్చిదిద్దాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
కుర్రాళ్లకు బంపర్ ఆఫర్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ
ఈ సిరీస్లో యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఐపీఎల్లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న అతడు జాతీయ జట్టులోకి రావడం హాట్ టాపిక్ అయింది. వీరితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ వేగవత్తమైన బౌలర్లు ప్రిన్స్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ కూడా మొదటిసారి నీలి రంగు జెర్సీని ధరించబోతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
