IND vs SA : సెకండ్ మ్యాచ్ లో విన్నింగ్ కాంబినేషన్ మారనుందా?
తొలి టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికాపై భారీ విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేయకపోయినప్పటికి బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆవేశ్ స్థానంలో పేసర్లు వైశాఖ్ విజయ్కుమార్ లేదా యశ్ దయాల్లలో ఒకరిని ఆడించవచ్చు.

తొలి టీ20లో సఫారీలపై ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా అదే ఉత్సాహంతో ఆదివారం రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. సాయంత్రం 7.30 గంటలకు సెయింట్ జార్జ్ పార్క్లో ఆతిథ్య జట్టుతో తలపడనుండి. నాలుగు మ్యాచ్ ల ఈ టీ20 సిరీస్ లో వరుసగా రెండో విజయంతో ముందజ వేసి తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్లో ఆపై బౌలింగ్లో టీమిండియా ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. అయితే రెండో టీ20లో భారత్ ఈ విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించకపోవచ్చు. తొలి టీ20లోని ఎలెవన్లో మార్పు చేయాలని కెప్టెన్ సూర్య ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.
బ్యాటింగ్ ఆర్డర్
మొదటి మ్యాచ్ లో సెంచరీ చేసిన వికెట్ కీపర్ సంజూ శాంసన్తో కలిసి యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ని ఆరంభించాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ విఫలమయినప్పటికి ప్రస్తుతానికి అతని స్థానాన్ని వేరే ఒకరితో భర్తీ చేసే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ లేదు. దీనికి కారణం లేకపోలేదు..ప్రస్తుతం జట్టులో ఓపెనింగ్ కోసం భారత్కు మరే ఇతర ఆప్షన్ లేకపోవడం కూడా కారణం కావచ్చు. తర్వాతి మ్యాచ్లోనూ సంజూ-అభిషేక్ జోడీ జట్టు ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయం. ఒకవేళ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా విఫలమయితే అభిషేక్ ను తప్పించే ఆలోచన టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇక వన్ డౌన్ లో ఆడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో బ్యాట్తో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. 17 బంతుల్లో 21 పరుగులు చేసిన సూర్య.. రెండో టీ20లో భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్లో చెప్పుకోదగ్గ మార్పులు ఉండకపోవచ్చు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ నాలుగు నుంచి ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. అందులో తిలక్ వర్మ మాత్రమే మొదటి మ్యాచ్ లో 18 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఫించ్ హిట్టర్లయిన హార్దిక్ 2 పరుగులు, రింకూ 11 పరుగులు మాత్రమే చేయగా, ఆల్ రౌండర్ అక్షర్ ఏడు పరుగులకే అవుట్ అయ్యాడు. అయినప్పటికి వీరందరూ కొనసాగనున్నారు.
బౌలింగ్ లైనప్లో మార్పు
రెండో టీ20లో భారత్ పేస్ బౌలింగ్ లైనప్ను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ లో తలో మూడు వికెట్లు తీసిన స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ప్లేయింగ్ ఎలెవన్లో ఉండటం ఖాయం. బౌలింగ్లో అక్షర్ ఒక ఓవర్లో ఎనిమిది పరుగులిచ్చి వికెట్ తీయలేదు. అయితే అక్షర్ పటేల్ బ్యాట్ తో కూడా రాణించే సత్తా ఉంది కాబట్టి అతడు కూడా ఆడటం దాదాపు ఖాయం. ఇక గత మ్యాచ్ లో అర్ష్దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పేస్ బౌలింగ్ కు సారథ్యం వహించారు. అర్ష్దీప్ జట్టులో కొనసాగుతుండగా, ఆవేశ్ స్థానంలో పేసర్లు వైశాఖ్ విజయ్కుమార్ లేదా యశ్ దయాల్లలో ఒకరిని ఆడించవచ్చు.



