Rohit Sharma : ఒకవైపు తిట్లు, మరోవైపు హగ్గులు.. రోహిత్ శర్మ చేసిన పనికి పాకిస్తాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా
Rohit Sharma : ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది.

Rohit Sharma : ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఆట కంటే కూడా మైదానం వెలుపల జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం చేతులు కూడా కలుపుకోకపోవడం ఒక ఎత్తైతే, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ దిగ్గజం వసీం అక్రమ్ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
2025 ఆసియా కప్ నుంచి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మానేశారు. ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్కు కనీసం చేయి కూడా కలపలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్లేయర్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు తప్ప గతంలోలా పలకరించుకోలేదు. అయితే, ఈ టీ20 ప్రపంచకప్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ మాత్రం తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. మైదానంలో వసీం అక్రమ్ను చూడగానే దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా హత్తుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతోంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 77 పరుగులు చేశాడు. యువ బ్యాటర్ల మెరుపులతో భారత్ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Surya Kumar Yadav didn’t shake hands with Salman Ali Agha at the toss.
Indian players didn’t shake Hands with Pakistanis at the end of the match.
But Rohit Sharma was seen hugging Pakistani Wasim Akram.
I just hope Rohit isn’t abused and shamed for it. pic.twitter.com/qJvN1xppIi
— Roshan Rai (@RoshanKrRaii) February 16, 2026
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ భారత బౌలర్లకు పోటీ ఇవ్వలేకపోయింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లతో పాక్ నడ్డి విరిచారు. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ (44) తప్ప మిగిలిన వారందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. ఆ జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు (10 పరుగులు) కూడా చేయలేకపోవడమే వారి ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఫలితంగా 18 ఓవర్లలోనే పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది.
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కొలంబో స్టేడియంలో అర్థమైంది. వరల్డ్ కప్ అంబాసిడర్గా ఆయన రాకతో గ్యాలరీల్లో జోష్ పెరిగింది. ఒకవైపు ఆటగాళ్ల మధ్య గొడవలు, షేక్ హ్యాండ్స్ వివాదాలు నడుస్తున్నా.. రోహిత్ మాత్రం హుందాగా ప్రవర్తించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సోషల్ మీడియాలో కొందరు రోహిత్ను విమర్శిస్తున్నప్పటికీ, మెజారిటీ అభిమానులు మాత్రం ఆయనలోని స్నేహపూర్వక వైఖరిని అభినందిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
