AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG : వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అంపైర్లు

IND vs AFG : ధర్మశాలలో వర్షం కారణంగా భారత్-అఫ్గానిస్తాన్ తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేయగా, రోహిత్ శర్మ భారత వన్డే చరిత్రలో అత్యంత వృద్ధ ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.

IND vs AFG  : వీడిన వాన గండం.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదించిన అంపైర్లు
Ind Vs Afg 1st Odi
Rakesh
|

Updated on: Jun 13, 2026 | 5:34 PM

Share

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ధర్మశాల వేదికగా ఎట్టకేలకు ప్రారంభమైంది. నిన్నటి రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల మ్యాచ్ జరగడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో టాస్ వేశారు. ఈ మ్యాచ్‌లో భారత తాత్కాలిక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నందున.. ప్రారంభంలో పిచ్ నుంచి తమ ఫాస్ట్ బౌలర్లకు లభించే స్వింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలనే ప్లాన్‌తో భారత్ బౌలింగ్ తీసుకుంది.

25 ఓవర్లకు కుదింపు

ధర్మశాలలో ఎడతెరిపి లేకుండా పడిన చిరుజల్లుల కారణంగా టాస్ వేయడం దాదాపు 3 గంటల 45 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఒకానొక దశలో కట్-ఆఫ్ సమయం దగ్గరపడుతుండటంతో మ్యాచ్ రద్దవుతుందేమోనని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ మైదానంలో అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఉండటంతో.. వర్షం తగ్గిన వెంటనే అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేయకుండా ఇరు జట్లకు చెరో 25 ఓవర్ల పాటు ఆడించాలని నిర్ణయించారు. దీంతో వన్డే మ్యాచ్ కాస్తా.. దాదాపు టీ20 ఫార్మాట్ తరహాలో హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా మారిపోయింది.

టీమిండియాలో ఇద్దరు యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

ఈ తొలి వన్డే మ్యాచ్ ద్వారా భారత జట్టు ఇద్దరు యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ వన్డే క్యాప్‌లను అందించింది. యువ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే, ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌లు ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. కాగా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లకు ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. 2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా జట్టులో సరికొత్త కాంబినేషన్లను పరీక్షించేందుకే ఈ మార్పులు చేసినట్లు కెప్టెన్ గిల్ తెలిపాడు.

రోహిత్ శర్మ ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డ్

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలోకి అడుగుపెట్టడమే ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ప్రస్తుతం 39 ఏళ్ల 44 రోజుల వయసున్న రోహిత్.. భారతదేశం తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో అతను దాదాపు 37 సంవత్సరాల క్రితం మాజీ దిగ్గజం మోహిందర్ అమర్‌నాథ్ (37 ఏళ్ల 36 రోజులు) నెలకొల్పిన రికార్డును అధికారికంగా బద్దలు కొట్టాడు. ఐపీఎల్ సమయంలో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్.. ఈ సిరీస్ ద్వారా తన పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.

కోహ్లీ, హార్దిక్ దూరం.. నితీష్ రెడ్డిపై కన్నేసిన సెలక్టర్లు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు గాయాల కారణంగా ఈ వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యారు. కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన యశస్వి బెంచ్‌కే పరిమితమవ్వగా.. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనపై సెలక్టర్లు, అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అటు అఫ్గానిస్తాన్ జట్టు కూడా హష్మతుల్లా షాహిదీ కెప్టెన్సీలో, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బలం చూసుకుని భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.

మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us