AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : నమీబియాతో భారత్ ఢీ..సంజూ, బుమ్రా వరల్డ్ కప్ ఎంట్రీ ఖాయమేనా?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు (ఫిబ్రవరి 12) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ తన రెండో మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన జోరులో ఉన్న టీమిండియా, ఇప్పుడు నమీబియాను కూడా చిత్తు చేయాలని చూస్తోంది.

T20 World Cup 2026 : నమీబియాతో భారత్ ఢీ..సంజూ, బుమ్రా వరల్డ్ కప్ ఎంట్రీ ఖాయమేనా?
Sanju Samson Debut, Jasprit Bumrah
Rakesh
|

Updated on: Feb 12, 2026 | 10:10 AM

Share

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు (ఫిబ్రవరి 12) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ తన రెండో మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన జోరులో ఉన్న టీమిండియా, ఇప్పుడు నమీబియాను కూడా చిత్తు చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కొన్ని ఆసక్తికరమైన మార్పులు, అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్ననే ఆయన డిశ్చార్జ్ అయినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌తో తన వరల్డ్ కప్ అరంగేట్రం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

వైరల్ ఫీవర్ కారణంగా అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. బుమ్రా రాకతో భారత బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. అయితే గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి రాణించిన మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు బెంచ్‌కే పరిమితం కావలసి ఉంటుంది. అర్ష్‌దీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం, అందుకే అతన్ని జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

నమీబియా మ్యాచ్‌కు ముందు టీమిండియాను చిన్న గాయం ఆందోళన కలిగించింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బుమ్రా వేసిన ఒక బుల్లెట్ లాంటి యార్కర్ ఇషాన్ కిషన్ కాలి వేలికి బలంగా తగిలింది. దీంతో అతను నొప్పితో విలవిలలాడుతూ కొద్దిసేపు ప్రాక్టీస్ ఆపేశాడు. అయితే, ప్రాథమిక చికిత్స తర్వాత మళ్ళీ బ్యాటింగ్ కొనసాగించడం కస్టమర్లలో ఊరటనిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం 90 శాతం వరకు ఉంది.

స్థానిక ఆటగాడు కుల్దీప్ యాదవ్‌కు ఢిల్లీ పిచ్‌పై మంచి పట్టు ఉన్నప్పటికీ, మేనేజ్మెంట్ మాత్రం వరుణ్ చక్రవర్తి వైపే మొగ్గు చూపుతోంది. అమెరికాపై వరుణ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా ఒక వికెట్ కూడా తీశాడు. పాకిస్థాన్ లాంటి పెద్ద మ్యాచ్‌కు ముందు విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడం ఇష్టం లేని టీమిండియా, వరుణ్‌ను మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగించే అవకాశం ఉంది.

నమీబియాతో మ్యాచ్‌కు భారత్ అంచనా జట్టు:

సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.