AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఒకే రోజులో రెండుసార్లు ఆలౌట్.. మాంచెస్టర్‌లో టీమిండియా చెత్త రికార్డ్..

India vs England: మాంచెస్టర్ మైదానంలో టీం ఇండియా టెస్ట్ రికార్డు చాలా పేలవంగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మైదానంలో టీం ఇండియా తొలి ఓటమి 72 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక బౌలర్ ఒంటి చేత్తో టీం ఇండియాను ఓడించాడు.

IND vs ENG: ఒకే రోజులో రెండుసార్లు ఆలౌట్.. మాంచెస్టర్‌లో టీమిండియా చెత్త రికార్డ్..
Ind Vs Eng Manchester Test
Venkata Chari
|

Updated on: Jul 20, 2025 | 9:10 AM

Share

India vs England: క్రికెట్ చరిత్రలో కొన్ని రోజులు ఎప్పటికీ నిలిచిపోతాయి. జట్టుకు అవమానకరమైన పరాజయాలు, బౌలర్ల అద్భుత ప్రదర్శనలు, అపురూప రికార్డులు.. ఇలాంటి క్షణాలు అభిమానుల మదిలో చెరిగిపోని ముద్ర వేస్తాయి. ఇటువంటి ఘటనే 1952లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకుంది. అదే రోజు భారత జట్టు రెండుసార్లు ఆలౌటైంది. ఆ రోజు ఇంగ్లండ్ పేస్ సంచలనం ఫ్రెడ్ ట్రూమన్ విధ్వంసం సృష్టించాడు.

చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు..

1952లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్‌లో జులై 17న ప్రారంభమైంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ లెన్ హట్టన్ అద్భుతమైన సెంచరీ (104)తో ఇంగ్లండ్ 347/9 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటంతో, మూడో రోజు (జులై 19) భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది.

అయితే, ఆ రోజు భారత బ్యాట్స్‌మెన్‌లకు ఫ్రెడ్ ట్రూమన్ రూపంలో ఒక పీడకల ఎదురైంది. అప్పటికి కేవలం 21 ఏళ్ల వయసున్న ట్రూమన్, తన అద్భుతమైన పేస్, స్వింగ్‌తో భారత బ్యాటింగ్ లైనప్‌ను చిన్నాభిన్నం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఫ్రెడ్ ట్రూమన్ 8.4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ప్రదర్శన టెస్టు క్రికెట్‌లో అప్పట్లో ఒక సంచలనం. విజయ్ మంజ్రేకర్‌ (22 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.

ఇవి కూడా చదవండి

ఒకే రోజు రెండు ఆలౌట్‌లు..

భారత జట్టు కేవలం 58 పరుగులకే ఆలౌట్ కావడంతో, ఇంగ్లండ్ ఫాలో-ఆన్ విధించింది. అదే రోజు, అనగా జులై 19న, భారత జట్టు మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ట్రూమన్ ఆధిపత్యం అక్కడితో ఆగలేదు. అలెక్ బెడ్సర్ (5/27), టోనీ లాక్ (4/36)తో కలిసి ట్రూమన్ (1/9) మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హేము అధికారి (27) ఒక్కడే కాస్త ప్రతిఘటించాడు.

ఈ విధంగా, భారత జట్టు ఒకే రోజు రెండుసార్లు (58, 82) ఆలౌటైన మొదటి టెస్ట్ జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌ను ఒక ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో గెలుచుకుంది.

ఫ్రెడ్ ట్రూమన్ దిగ్గజ ప్రదర్శన..

ఈ మ్యాచ్‌లో ఫ్రెడ్ ట్రూమన్ చూపిన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అతని కెరీర్‌కు ఒక ప్రారంభ సూచిక. “ఫైరీ ఫ్రెడ్”గా పేరొందిన ట్రూమన్, టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు. మాంచెస్టర్ టెస్టులో అతని 8/31 గణాంకాలు అతని అత్యుత్తమ టెస్టు బౌలింగ్ గణాంకాలుగా మిగిలిపోయాయి.

భారత క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయినప్పటికీ, ఫ్రెడ్ ట్రూమన్ అద్భుత ప్రదర్శన మాత్రం క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం భారత జట్టుకు ఇప్పటికీ కలిసొచ్చిన గ్రౌండ్ కాదు, ఆ 1952 నాటి చేదు అనుభవాలు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..