AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng 3rd T20I: ఇంగ్లాండ్‌తో మూడో టీ20.. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా క్లియర్ మెసేజ్

Ind vs Eng 3rd T20I: ఇంగ్లాండ్‌తో మూడో టీ20కి ముందు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక సందేశం ఇచ్చారు. సహజసిద్ధమైన ఆటతీరునే కొనసాగించాలని సూచించిన మేనేజ్‌మెంట్, అతనిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది.

Ind vs Eng 3rd T20I: ఇంగ్లాండ్‌తో మూడో టీ20.. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా క్లియర్ మెసేజ్
India
Rakesh
|

Updated on: Jul 07, 2026 | 2:57 PM

Share

Ind vs Eng 3rd T20I: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇటీవల కాలంలో తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని భారత టీ20 జట్టులోకి ఎంపిక చేయడం ఒకటి. ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు ఇండియా ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణించడంతో సెలెక్టర్లు అతని ప్రతిభను గుర్తించి వెంటనే జాతీయ జట్టుకు పిలుపునిచ్చారు. అయితే, ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనే డెబ్యూ చేస్తాడని అభిమానులంతా ఆశించారు. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ మరో వ్యూహంతో ముందుకు వెళ్లడం వల్ల అతని అరంగేట్రం కాస్త ఆలస్యమైంది.

ఐర్లాండ్ సిరీస్ మొత్తంతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీనితో తీవ్ర అసంతృప్తికి లోనైన భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు మేనేజ్‌మెంట్ క్యాప్ అందించి తుది జట్టులోకి తీసుకుంది. తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో వైభవ్ కొన్ని మెరుపు షాట్లు ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీనితో సోషల్ మీడియాలో ఒక వర్గం అభిమానులు అతనిపై విమర్శలు చేయడం ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే అత్యంత కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని వైభవ్ సూర్యవంశీకి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. సూర్యవంశీ జట్టులోకి వచ్చినప్పటి నుంచే అతని అరంగేట్రం ఖాయమైందని, ఇది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. “సూర్యవంశీ ఏ ఆట తీరును ప్రదర్శించి ఈ స్థాయికి చేరుకున్నాడో, అదే శైలిని మున్ముందు కూడా కొనసాగించాలి. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆందోళన చెందకుండా, తన సహజసిద్ధమైన ఆటను నమ్ముకుని, తన అంతర్లీన ఆలోచనలకు అనుగుణంగా ఆడాలని మేము అతనికి స్పష్టంగా చెప్పాము” అని కోటక్ వెల్లడించారు.

వాస్తవానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలే పెట్టుకుంది. అందుకే అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని తట్టుకునేలా, అతనికి నేరుగా అవకాశం ఇవ్వకుండా ముందుగా జట్టు వాతావరణానికి అలవాటు పడేలా సమయం ఇచ్చారు. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్ ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కానీ, కేరళ స్టార్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్‌లో చూపించిన ఫామ్‌ను ఇక్కడ పునరావృతం చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. దీనితో గంభీర్ అతనిపై వేటు వేసి, ఆ స్థానంలో యువ రక్తం వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు.

రెండో మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతనికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది. మంగళవారం జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి, భారీ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని యాజమాన్యం గట్టిగా ఆశిస్తోంది. మరి ఈ కీలక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us