
వన్డే వరల్డ్ కప్లో వరుస విజయాలతో దూసుకెలుతోన్న టీమిండియా ఆదివారం (అక్టోబర్ 29) ఇంగ్లండ్తో తలపడనుంది. ఇప్పటికే 5 విజయాలు సాధించిన భారత జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించగలిగితే మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అలాగే సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. మరోవైపు మేజర్ టోర్నీలో ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింటలో పరాజయం పాలైన ఆ జట్టు ఇప్పటికే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే గాయపడిన సింహం లాగా ఇంగ్లండ్ జట్టు విజృంభించే అవకాశాలున్నాయి. దీనికి తోడు ఆ జట్టు ఆటగాళ్లపై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి చెలరేగి ఆడే ఛాన్సుంది. అందువల్ల ఇంగ్లండ్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే రోహిత్ సేన ఇంగ్లిష్ జట్టుపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది.
ప్రపంచకప్లో రెండు జట్ల రికార్డును పరిశీలిస్తే.. భారత్-ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగాయి. ఈ 8 మ్యాచ్ల్లో భారత్ 3 గెలవగా, ఇంగ్లండ్ 4 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై గా ముగిసింది. 2003లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్ చివరిసారిగా ఇంగ్లండ్పై గెలిచింది. 2007, 2011, 2015, 2019 ప్రపంచకప్లలో ఇంగ్లండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఇక ఓవరాల్గా
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటి వరకు 106 వన్డే మ్యాచ్లు జరగ్గా అందులో భారత్ 57 మ్యాచ్లు గెలవగా, ఇంగ్లండ్ 44 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. 2 మ్యాచ్లు టై అయ్యాయి. ఇక స్వదేశంలో ఇంగ్లండ్తో భారత్ 55 వన్డే మ్యాచ్లు ఆడగా, అందులో 33 మ్యాచ్లు గెలవగా, ఇంగ్లండ్ 23 మ్యాచ్లు గెలిచింది. ఇక భారతదేశం, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి వన్డే 1974 జూలై 13 న జరిగింది, ఇందులో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక చివరిసారిగా 2022 జులై 17న తలపడగా, టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై విజయం సాధించింది.
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..