
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో జరగాల్సిన కీలక లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సి ఉంది. ఇలా ఒక జట్టు స్వచ్ఛందంగా మ్యాచ్ను బహిష్కరించినప్పుడు, దానికి బీమా రక్షణ లభించదు. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి తీవ్ర ఆర్థిక, చట్టపరమైన చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పీసీబీ భారీ పెనాల్టీలను ఎదుర్కోవడంతో పాటు బ్రాడ్కాస్టర్ల నుంచి చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఏ ఐసీసీ టోర్నీలోనైనా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లకు ఉండే క్రేజ్, ఆసక్తి అసాధారణం. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుకు రికార్డు స్థాయిలో వీక్షకులు ఉంటారు. ఫలితంగా, ఈ మ్యాచ్తో ముడిపడి ఉన్న వాణిజ్య కార్యకలాపాలకు భారీ విలువ ఉంటుంది. ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టిక్కెట్ల విక్రయాలు వంటి వాటితో కలిపి, ఈసారి భారత్-పాక్ మ్యాచ్ విలువ దాదాపు రూ. 4,500 కోట్లుగా అంచనా వేశారు. ఈ అంచనా విలువలో టీవీ, డిజిటల్ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ భాగం. కేవలం భారత్-పాక్ టీ20 మ్యాచ్ కోసం ప్రకటనల ధరలు 10 సెకన్ల స్లాట్కు రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటాయి. ఓవరాల్గా, ప్రకటనల ద్వారానే రూ. 300 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ప్రపంచకప్లో సగటున ఒక మ్యాచ్ విలువ రూ. 138 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
ఇండియా, పాకిస్తాన్ ఈ మ్యాచ్లో తలపడకపోతే, బ్రాడ్కాస్టర్ల యాడ్స్ ఆదాయంలో తీవ్రంగా నష్టపోతారు. అంతేకాదు, టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లపై కూడా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో వారి రాబడి మరింత తగ్గుతుంది. బ్రాడ్కాస్టర్లకు మొత్తం రూ. 370 కోట్ల నుంచి రూ. 400 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ నష్టాన్ని ఐసీసీ భరిస్తుంది. అయితే ఆ మేరకు సభ్యదేశాలకు పంచే ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఈ చర్యలతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న క్రికెట్ బోర్డులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడే జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ వంటి చిన్న దేశాలు మాత్రం తీవ్రంగా నష్టపోతాయి.
భారత్, పాక్ మ్యాచ్ రద్దయితే, ఈ రెండు దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోతాయి. ఒక్కో దేశానికి దాదాపు రూ. 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ)పై ఈ నష్టం ప్రభావం పెద్దగా ఉండదు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి మాత్రం ఇది పెనుభారంగా మారనుంది. ఐసీసీ మొత్తం ఆదాయంలో పీసీబీ వాటా 5.75 శాతం, ఇది సంవత్సరానికి 34.51 మిలియన్ డాలర్లతో సమానం. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పీసీబీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది. ఐసీసీ పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, పాక్ క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి