
Indian Cricket Retirement News: భారత క్రికెట్ జట్టులో గంభీర్ యుగం మొదలైనప్పటి నుంచి సీనియర్ ఆటగాళ్లకు కష్టాలు తప్పడం లేదు. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ సీనియర్లను పక్కన పెట్టే ప్రణాళికతో హెడ్ కోచ్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ వన్డేల నుంచి తప్పుకోబోతున్నారనే వార్తల నడుమ, మరో నలుగురు సీనియర్ స్టార్ క్రీడాకారులు కూడా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్ ఆటగాళ్ల పట్ల గంభీర్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. పేలవ ఫామ్తో సతమతమవుతున్న ఆటగాళ్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు జట్టుకు దూరమవ్వగా, రోహిత్ శర్మ సైతం వన్డే కెరీర్కు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే, కేవలం రోహిత్ మాత్రమే కాదు.. గంభీర్ వ్యూహాల వల్ల రిటైర్మెంట్ ప్రకటించక తప్పని స్థితిలో ఉన్న ఆ నలుగురు భారతీయ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చదవండి: తప్పు జరిగింది అక్కడే.. అతన్ని నమ్మి ఓడిపోయాం.. ఆ ఒక్కడు ఉండుంటే ఫలితం మరోలా..
భారత అగ్రశ్రేణి వేగవంతమైన బౌలర్లలో ఒకరైన మొహమ్మద్ షమీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయనకు భారత జట్టులో మళ్లీ స్థానం దక్కలేదు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో రాణిస్తున్నప్పటికీ, జాతీయ సెలక్టర్లు మాత్రం ఆయన వైపు చూడటం లేదు. యువ బౌలర్ల వైపే మొగ్గు చూపుతుండటంతో, షమీ అంతర్జాతీయ కెరీర్కు ఇక తెరపడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన త్వరలోనే అధికారికంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
ఒకప్పుడు పవర్ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన భువనేశ్వర్ కుమార్ సైతం ప్రస్తుత మేనేజ్మెంట్ ప్రణాళికల్లో లేరు. ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి వికెట్ల వేట సాగించినప్పటికీ, ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ పర్యటనలకు ఆయనను ఎంపిక చేయలేదు. కోచ్ గంభీర్ భవిష్యత్ అవసరాల కోసం యువ పేసర్లపైనే నమ్మకం ఉంచారు. వరుసగా ఎదురవుతున్న నిర్లక్ష్యానికి విసిగిపోయిన భువీ, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్న యుజ్వేంద్ర చహల్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. చాలా కాలంగా ఆయనకు తుది జట్టులో అవకాశాలు రావడం లేదు. ఇటీవలి కాలంలో ఆయన ప్రదర్శన కూడా అంతగా ఆకట్టుకోలేదు. జట్టులోకి కొత్త తరం స్పిన్నర్లను తీసుకొస్తుండటంతో చహల్కు మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. దీంతో ఆయన కూడా రిటైర్మెంట్ బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది.
అనుభవజ్ఞుడైన బ్యాటర్ అజింక్య రహానే ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమయ్యారు. కేవలం టెస్టు జట్టులోనే ఆయనకు అప్పుడప్పుడు అవకాశాలు లభించేవి. కానీ, రెండేళ్ల క్రితం ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత ఆయనకు సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ప్రస్తుతం రహానే కేవలం దేశవాళీ మ్యాచ్లలో మాత్రమే ఆడుతున్నారు. యువ ఆటగాళ్లు మిడిలార్డర్లో పాతుకుపోతుండటంతో, రహానేకు తిరిగి భారత జట్టులో చోటు దక్కడం అసాధ్యంగా మారింది. దీనివల్ల ఆయన కూడా తన వీడ్కోలు ప్రకటనను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..