
CSK Punish Player Jishan Adil Due to Social Media: ఈ సీజన్ లో సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న చెన్నై సూపర్ కింగ్స్, తాజాగా తన నెట్ బౌలర్ జిషన్ ఆదిల్ను శిక్షించింది. ఢిల్లీకి చెందిన ఈ లెగ్ స్పిన్నర్ గత ఏడాది నుంచి సీఎస్కే శిబిరంలో కొనసాగుతున్నాడు. అయితే, జట్టు ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అతను నిబంధనలను అతిక్రమించినట్లు యాజమాన్యం గుర్తించింది. ప్రాక్టీస్ నెట్స్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో సహా ఇతర ప్రముఖ ఆటగాళ్లకు బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను అతను నెట్టింట పంచుకోవడంతో ఈ వివాదం మొదలైంది.
బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఆటగాళ్లు తమ వ్యక్తిగత ప్రచారం కోసం జట్టు శిక్షణకు సంబంధించిన వీడియోలు లేదా రీల్స్ చేయకూడదు. ఇలాంటి వీడియోలు ప్రత్యర్థి జట్లకు జట్టు వ్యూహాలను, ఆటగాళ్ల లోపాలను వెల్లడించే అవకాశం ఉందని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే, జిషన్ ఆదిల్ పోస్ట్ చేసిన వీడియోలను వెంటనే తొలగించాలని సీఎస్కే ఆదేశించింది. వృత్తిపరమైన నిబద్ధతను కాపాడటానికి, ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి ఈ చర్య తీసుకున్నట్లు జట్టు స్పష్టం చేసింది.
యాజమాన్యం చర్యల అనంతరం జిషన్ ఆదిల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశాడు. అందులో అతను ఇలా పేర్కొన్నాడు: “హాయ్ అందరికీ, నేను సీఎస్కే క్యాంప్ నుంచి పోస్ట్ చేసిన బౌలింగ్ వీడియోలు మీ ఆదరణతో వైరల్ అయ్యాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ వీడియోలను తొలగించమని మేనేజ్మెంట్ నన్ను కోరింది. దీని వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో నిబంధనలకు లోబడి మంచి కంటెంట్ను మీకు అందిస్తాను. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.”
కేవలం సీఎస్కే మాత్రమే కాకుండా, ఇతర జట్లు కూడా సామాజిక మాధ్యమాలపై నిఘా పెంచాయి. గతంలో అర్ష్దీప్ సింగ్ ఐపీఎల్ వ్లాగ్ల విషయంలో కూడా పంజాబ్ కింగ్స్ ఇలాగే స్పందించింది. జట్టు ప్రతిష్టను కాపాడటం, ఆటగాళ్లు కేవలం ఆటపైనే దృష్టి సారించేలా చూడటమే లక్ష్యంగా బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..