Champions Trophy: 100 మందికి పైగా పోలీసులను సస్పెండ్ చేసిన పాకిస్థాన్! కారణం తెలిస్తే ఛీ అంటారు
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ భారీ భద్రత ఏర్పాటు చేసింది. కానీ, అధిక పనిభారం కారణంగా 100 మందికి పైగా పోలీసులు విధులకు హారయ్యేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో వారిని పాక్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. పోలీసులకు తగినంత సదుపాయాలు లేకపోవడం, అధిక గంటల పని తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయంపై నెటిజన్లు, విమర్శకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ ప్రభుత్వం భారీ భద్రతాను ఏర్పాటు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా కొన్నేళ్లు పాకిస్థాన్కు ఏ టీమ్ కూడా వెళ్లి క్రికెట్ ఆడలేదు. ఇండియా అయితే ఇప్పటికీ పాకిస్థాన్కు వెళ్లడం లేదు. కానీ, గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి జట్లు ధైర్యం చేసి పాకిస్థాన్ వెళ్లి కొన్ని సిరీస్లు ఆడాయి. దీంతో ఐసీసీ వారికి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం కల్పించింది. కానీ, భారీ భద్రతా ఏర్పాటు చేయాలని ముందే హెచ్చరించింది. పాకిస్థాన్కు వచ్చిన క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు భయపడుతున్న క్రమంలో ఎయిర్ పోర్ట్ వద్ద, స్టేడియాల వద్ద, క్రికెటర్లు బస చేసే హోటల్స్ వద్ద, అలాగే ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియానికి, స్టేడియం నుంచి హోటల్కి వెళ్లే క్రమంలో వారికి సెక్యురిటీగా భారీ సంఖ్యలలో పోలీస్ సిబ్బందిని నియమించింది. కానీ, ఉన్నపళంగా వంద మందికిపైగా పోలీసులను వారి ఉద్యోగాల నుంచి తొలగించింది.
నిన్నటి వరకు గన్ పట్టుకొని స్టేడియాల వద్ద, క్రికెటర్లకు రక్షణగా ఉన్న ఆ పోలీసులు ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి కుటుంబాల సహా రోడ్డునపడ్డారు. ఇంతకీ వారిని ఎందుకు ఉద్యోగాల నుంచి తప్పించారంటే.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా పోలీసులకు పని భారం అధికం అయింది. డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కొన్ని సార్లు 15, 20 గంటల వరకు ఒక్కటే చోట నిల్చోని ఉండాల్సిన పరిస్థితి ఉంది. సరైన షిఫ్ట్ విధానం లేకపోవడంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ వంద మందికిపైగా పోలీసులు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన విధుల్లో పాల్గొనేందుకు విముఖత చూపారు. ఎవరైతే ఛాంపియన్స్ ట్రోఫీ డ్యూటీకి రాలేదో వారందరినీ కూడా పాక్ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.
ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహిస్తున్న క్రమంలో భద్రతా బలంగా ఉండాలి కరెక్టే. కానీ, అందుకోసం సరిపడా సిబ్బందిని నియమించుకోకుండా ఉన్న వారినే సమయంతో నిమిత్తం లేకుండా గంటల తరబడి పనిచేస్తే ఎలా? అనే విమర్శలు వస్తున్నాయి. అవసరం అనుకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకోవాలి కానీ పోలీసులను ఇలా హింసించడం కరెక్ట్ కాదు అంటున్నారు నెటిజన్లు. డ్యూటీలో ఉన్న పోలీసులకు కనీసం నీళ్లు, ఆహారం కూడా ఇచ్చే వారు ఉండరంటూ ఇతర పోలీసులు వాపోతున్నారు. అలాంటి డ్యూటీలు ఎలా చేసేది అన్న పాపానికి పూర్తిగా ఉద్యోగం నుంచే తొలగించడం అన్యాయం అంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




