Arshdeep Singh : ప్రేమలో పడ్డాడు.. బీసీసీఐ రూల్స్ మర్చిపోయాడు.. అర్ష్‌దీప్ కొంపముంచుతున్న వీడియో

Arshdeep Singh : భారత టీ20 స్టార్ బౌలర్, పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ రూపొందించిన కఠినమైన నిబంధనలను ఆయన ఉల్లంఘించారనే వార్తలు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Arshdeep Singh : ప్రేమలో పడ్డాడు.. బీసీసీఐ రూల్స్ మర్చిపోయాడు.. అర్ష్‌దీప్ కొంపముంచుతున్న వీడియో
Arshdeep Singh

Updated on: May 13, 2026 | 1:43 PM

Arshdeep Singh : భారత టీ20 స్టార్ బౌలర్, పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ రూపొందించిన కఠినమైన నిబంధనలను ఆయన ఉల్లంఘించారనే వార్తలు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సమ్రీన్ కౌర్‌తో కలిసి టీమ్ బస్సులో ప్రయాణిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో వైరల్ కావడమే దీనికి కారణం. అసలే బీసీసీఐ హనీ ట్రాపింగ్ ముప్పుల నేపథ్యంలో ప్లేయర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన జరగడం విశేషం.

ఏమిటా కొత్త నిబంధనలు?

గత వారం బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఫ్రాంచైజీలకు 7 పేజీల సుదీర్ఘ గైడ్‌లైన్స్‌ను పంపారు. ఇందులో ముఖ్యంగా అనధికార వ్యక్తులను టీమ్ హోటల్స్ లోకి, ప్లేయర్ల గదుల్లోకి అనుమతించకూడదని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఆటగాళ్లు బయటకు వెళ్లాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలని, వారి గర్ల్ ఫ్రెండ్స్ టీమ్ బస్సులో లేదా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై పరిమితులు విధించారు. ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం హనీ ట్రాపింగ్ వంటి ముప్పుల నుంచి ఆటగాళ్లను కాపాడటమేనని బోర్డు పేర్కొంది.

అర్ష్‌దీప్ సింగ్ తన ప్రేయసిగా భావిస్తున్న సమ్రీన్ కౌర్‌తో కలిసి పంజాబ్ కింగ్స్ బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “బీసీసీఐ అంటే భయం లేదా? గ్రౌండ్ లో ఫెయిల్ అవుతున్నావు కానీ లవ్ ఫీల్డ్ లో మాత్రం సిక్సర్లు కొడుతున్నావు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బోర్డు కూడా ఈ సంఘటనపై అసంతృప్తిగా ఉన్నట్లు, అర్ష్‌దీప్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పంజాబ్ కింగ్స్ ఘాటు స్పందన

ఈ వార్తలు ముదురుతున్న క్రమంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రంగంలోకి దిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక ప్రకటన విడుదల చేస్తూ, అనవసరమైన ఊహాగానాలను నమ్మవద్దని కోరింది. “క్రీడల్లో విమర్శలు, సరదా సంభాషణలు సహజం. కానీ తప్పుడు కథనాలను సృష్టించడం సరికాదు. వాస్తవాలను ధృవీకరించుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు” అంటూ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేసింది. అంటే అర్ష్‌దీప్ విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవాలని పరోక్షంగా కొట్టిపారేసింది.

మైదానంలో అర్ష్‌దీప్ ఫామ్ ఎలా ఉంది?

మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ 2026లో మిశ్రమ ప్రదర్శన కనబరుస్తున్నారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు అందరూ ఇబ్బంది పడుతున్నా, అర్ష్‌దీప్ మాత్రం 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి తన టీమ్ లో టాప్ వికెట్ టేకర్ గా ఉన్నారు. అయితే ఆయన ఎకానమీ రేటు 10 కి దగ్గరగా ఉండటం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మాత్రం 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి అద్భుతమైన స్పెల్ వేశారు.

మొత్తానికి ఈ నిబంధనల వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. బీసీసీఐ నిజంగానే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే, అది కేవలం అర్ష్‌దీప్ సింగ్‌కే కాకుండా ఐపీఎల్ లోని అందరు ఆటగాళ్లకు ఒక హెచ్చరికగా మారుతుంది. పంజాబ్ కింగ్స్ ఇది ఫేక్ న్యూస్ అని చెబుతున్నా, సోషల్ మీడియాలో మాత్రం చర్చ ఆగడం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us