Abhishek Sharma : ఫోన్ పక్కన పడేయ్.. గేమ్ మీద దృష్టి పెట్టు.. అభిషేక్ కు గంభీర్ ఇచ్చిన ‘వార్నింగ్’ ఇదే

Abhishek Sharma : క్రికెట్ ప్రపంచంలో ఒక ఆటగాడు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలన్నా, ఒక్కసారిగా పాతాళానికి పడిపోవాలన్నా అది సోషల్ మీడియా వల్లే సాధ్యమవుతుంది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

Abhishek Sharma : ఫోన్ పక్కన పడేయ్.. గేమ్ మీద దృష్టి పెట్టు.. అభిషేక్ కు గంభీర్ ఇచ్చిన వార్నింగ్ ఇదే
Abhishek Sharma

Updated on: Mar 16, 2026 | 10:10 AM

Abhishek Sharma : క్రికెట్ ప్రపంచంలో ఒక ఆటగాడు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలన్నా, ఒక్కసారిగా పాతాళానికి పడిపోవాలన్నా అది సోషల్ మీడియా వల్లే సాధ్యమవుతుంది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2025లో అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్, ప్రపంచకప్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్ (సున్నా పరుగులు) అయి తీవ్ర విమర్శల పాలయ్యాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనాటి చేదు జ్ఞాపకాలను, సీనియర్ల అండను అభిషేక్ పంచుకున్నాడు.

వరల్డ్ కప్ ప్రారంభంలో అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచుల్లో అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ సమయంలో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై దారుణమైన ట్రోల్స్ చేశారు. అభిషేక్ జట్టులో ఉండటానికి అనర్హుడు అంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఈ వరుస డకౌట్లతో అభిషేక్ మానసికంగా కుంగిపోయాడు. సరిగ్గా అదే సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అతడికి అండగా నిలిచారు.

అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత అభిషేక్ దగ్గరకు వెళ్లిన సూర్య, గంభీర్, హార్దిక్.. “ముందు నీ ఫోన్ ఇటు ఇవ్వు, సోషల్ మీడియా యాప్స్ అన్నీ అన్ఇన్‌స్టాల్ చెయ్” అని గట్టిగా చెప్పారట. నెటిజన్ల కామెంట్లు, సలహాలు చూడటం వల్లే ఏకాగ్రత దెబ్బతింటుందని వారు హెచ్చరించారు. ఆ క్షణమే తాను సోషల్ మీడియాకు దూరమయ్యానని, అదే తనను మళ్ళీ గాడిలో పడేలా చేసిందని అభిషేక్ చెప్పుకొచ్చాడు. “భారతదేశంలో ప్రజలకు మనపై చాలా అంచనాలు ఉంటాయి, విఫలమైనప్పుడు విమర్శించడం సహజం. వాటిని వినాలి కానీ పట్టించుకోకూడదు” అని అభిషేక్ పేర్కొన్నాడు.

సోషల్ మీడియాకు దూరమైన తర్వాత అభిషేక్ ఆటతీరులో మార్పు వచ్చింది. సౌతాఫ్రికాపై పరుగుల ఖాతా తెరిచిన అతను, జింబాబ్వేపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత వెస్టిండీస్, ఇంగ్లాండ్‌పై పెద్దగా రాణించకపోయినా.. అసలైన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపం చూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ శాంసన్‌తో కలిసి 98 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us