
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట పండుతోంది. ముఖ్యంగా షూటర్ల గురి అసలు తప్పడం లేదు. నాలుగో రోజు మొత్తం 7 పతకాలతో దుమ్ము రేపిన షూటర్లు గురువారం (సెప్టెంబర్ 29)న మరింత దూకుడు చూపారు. మరో బంగారు పతకాన్ని సాధించడంతో పాటు వ్యక్తిగత విభాగాల్లో తదుపరి రౌండ్లకు అర్హత సాధించారు. చైనాలోని హౌంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా త్రయం చైనాను ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విభాగంలో మొత్తం 1734 స్కోరు సాధించిన భారత్ త్రయం చైనాను కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడించడం విశేషం. ఈ విభాగంలో మూడో స్థానంలో నిలిచిన వియత్నాం కాంస్యంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు వుషు విభాగంలో మహిళల 60 కేజీల కేటగిరిలో రోషిబినా దేవి రజత పతకాన్ని గెల్చుకుంది. ఫైనల్ లో చైనా వు షియోవోతో జరిగిన బౌట్ లో రోషిబినా దేవి ఓడిపోయింది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకుంది రోషిబినా.
ఇక పతకాల విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 24 పతకాలు చేరాయి. ఇందులో 6 బంగారం, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో ప్రస్తుతం భారత్ ఐదో స్థానంలో ఉంది. జిమ్నాస్టిక్స్లో ప్రణతి నాయక్పై భారీ ఆశలు ఉన్నాయి. అలాగే షూటింగ్, ఈక్వెస్ట్రియన్ వంటి ఈవెంట్లలో పతకాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక టెన్నిస్ పోటీల్లో భారత జోడీ సాకేత్ మైనేని- రామ్కుమార్ రామనాథన్ జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక్కడా కూడా పతకాలు వచ్చే ఛాన్సలు ఉన్నాయి.
కాగా ఇదే క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్లో తెలంగాణకు చెందిన ఈషా సింగ్ బృందం బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈషా సింగ్కు అభినందనలు తెలిపారు. ఈషా సింగ్ బృందం 1,759 పాయింట్లతో భారత్కు బంగారు పతకం సాధించిందని, టీమ్ స్పిరిట్ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని, అందుకే అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు మెరుస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..