
మహా శివరాత్రి అంటే శివభక్తులకు ఎంతో పవిత్రమైన రాత్రి. ఇది “శివుని అత్యంత మహత్తరమైన జ్ఞాపక రాత్రి”గా భావించబడుతుంది. శివుడు బ్రహ్మాండంలోని అస్తిత్వం, ధర్మం, సంస్కారం, సమతుల్యత అనే భావాల ప్రతీక. ఈ రోజు శివుడి రూపంలో అనంత శక్తి, నిష్కలాంకత, సమాధి, ఆత్మానుభూతి అన్నీ కలిసి కనబడతాయి. ఈరోజు ఉపవాసం, జాగరణ చేయడం అనేది ప్రధానంగా భావిస్తారు. ఈరోజు శివ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి మహా దేవుడిని స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.
శివరాత్రి రోజు తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన నియమాలలో ఉపవాసం ఒకటి. ఉపవాసం అనే పదానికి రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి. సాధారణంగా ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనే భావన ప్రచారంలో ఉంది. ఈ రకమైన ఉపవాసం వల్ల శరీరంలో కొవ్వు కరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఋషులు ప్రతి పండుగకు ఉపవాస నియమాన్ని జతచేశారు.
అయితే, కేవలం ఆహారం మానేసి తీవ్రమైన ఉపవాసాలు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి ఆరోగ్య సమస్యలున్నవారు కటిక ఉపవాసాలు పాటించి ఇబ్బందులకు గురవుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి ఉపవాసాలు మంచివి కావని ఆధ్యాత్మికవేత్త నండూరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఉపవాసానికి ఉన్న రెండవ, అసలైన అర్థం ఏమిటంటే, దగ్గరగా ఉండటం. అంటే మన మనస్సును పరమేశ్వరుడికి దగ్గరగా రోజంతా ఉంచగలిగితే.. దానినే నిజమైన ఉపవాసం అంటారు. ఆహారం మానేయడం అనేది కేవలం భౌతికమైన చర్య కాగా, మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం ఆధ్యాత్మికంగా మరింత ముఖ్యమైనది. శివరాత్రి రోజున ఈ అంతర్గత అనుసంధానం ద్వారానే పరిపూర్ణ ఉపవాస ఫలం లభిస్తుందని నండూరి శ్రీనివాస్ వివరించారు.
(Disclaimer : ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)