Shani Jayanti 2026: శని దేవుని జన్మ వృత్తాంతం.. జాతక దోషాలను తొలగించే పవిత్ర వ్రత కథను చదివితే.. మీ కష్టాలన్నీ తీరినట్టే!
మనం శని జయంతి సందర్భంగా శని దేవుడిని పూజించేటప్పుడు, శని జయంతి కథను వింటాము లేదా చదువుతాము. శని దేవుడు న్యాయానికి అధిపతి. ఆయన ఎవరికీ అన్యాయం చేయడు, దుర్మార్గపు పనులు చేసే వారిని వదిలిపెట్టడు. ఆయన తన తండ్రి అయిన సూర్యదేవుడు తప్పు చేసినప్పుడు కూడా అతడిని వదిలిపెట్టలేదు. శని దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో కనీసం రెండుసార్లు వస్తాడు. ఒకసారి సడే సతి సమయంలో, రెండవసారి ధైయా సమయంలో. అప్పుడు ఆయన వారి కర్మల ఫలితాలను ఇస్తాడు. ఈ రోజు శని జయంతి సందర్భంగా శని జయంతి కథను తెలుసుకుందాం.

హిందూ సనాతన ధర్మంలో శని దేవుడిని కర్మఫల ప్రదాతగా, న్యాయదేవతగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాస అమావాస్య తిథి నాడు శని జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన శని దేవుని జన్మ వృత్తాంతాన్ని (వ్రత కథ) భక్తితో చదవడం లేదా వినడం వల్ల ఏల్నాటి శని, ధైయా, శని మహాదశల వల్ల కలిగే కష్టాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
సూర్య పుత్రుడైన శని దేవుని జన్మ కథ:
శనిదేవుని జనన వృత్తాంతం స్కంద పురాణంలో ఉంది. అతని తండ్రి సూర్యదేవుడు, తల్లి ఛాయ. గ్రహరాజు అయిన సూర్యదేవుడు, ప్రజాపతి దక్షుని కుమార్తె అయిన సంజ్ఞను వివాహం చేసుకున్నాడు. స్కంద పురాణం, బ్రహ్మ పురాణం ప్రకారం.. సూర్య భగవానుని భార్య అయిన సంజ్ఞ సూర్యుని అపారమైన తేజస్సును, వేడిని భరించలేకపోయింది. దీనికి పరిష్కారంగా ఆమె తన తపోబలంతో తనలాగే ఉండే ఒక ప్రతిరూపాన్ని సృష్టించి, ఆమెకు ఛాయ అని పేరు పెట్టింది. తన స్థానంలో సూర్య దేవునికి సేవ చేయమని ఛాయకు ఆదేశించి, సంజ్ఞ తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయింది. సూర్య దేవునికి ఈ రహస్యం తెలియదు.
సూర్యుడు, ఛాయల కలయికతో శని దేవుడు జన్మించారు. అయితే ఛాయ గర్భవతిగా ఉన్న సమయంలో శివుని కోసం ఎండనక, ఆకలి దప్పులనక కఠోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సు ప్రభావం, సూర్యుని వేడి కారణంగా గర్భంలో ఉన్న శిశువు (శని దేవుడు) నల్లటి రంగులోకి మారిపోయాడు. జ్యేష్ఠ అమావాస్య నాడు శని దేవుడు జన్మించినప్పుడు, ఆయన నల్లటి రూపాన్ని చూసి సూర్య దేవుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఛాయ పాతివ్రత్యాన్ని శంకించి, శని తన కుమారుడు కాదని తిరస్కరించాడు.
ఈశ్వరుడి ఇచ్చిన న్యాయాధికారి పదవి:
తల్లికి జరిగిన ఈ అవమానాన్ని చూసి శని దేవుడు క్రోధాగ్నితో సూర్యుడి వైపు చూశాడు. శని దేవుని క్రూర దృష్టి పడగానే సూర్య భగవానుడు కూడా నల్లగా మారిపోయి, ఆయన రథం ఆగిపోయింది. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి సూర్యుడు శివుడిని ప్రార్థించగా, పరమశివుడు సూర్యునికి అసలు నిజం వివరించాడు. ఛాయ చేసిన కఠిన తపస్సు వల్లే బాలుడు అలా జన్మించాడని, అతను సామాన్యుడు కాదని తెలిపాడు.
శివుడు శని దేవునికి బ్రహ్మాండంలోనే అత్యున్నతమైన న్యాయాధికారి, కర్మఫల ప్రదాత పదవులను ఇచ్చి అనుగ్రహించాడు. మనుషులు చేసే మంచి, చెడు కర్మల ఆధారంగా శని దేవుడు ఫలితాలను ఇస్తాడని స్పష్టం చేశాడు. నిజం తెలుసుకున్న సూర్య దేవుడు తన తప్పు తెలుసుకుని శని దేవుడిని ఆశీర్వదించాడు. శని జయంతి రోజున ఈ కథను స్మరించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, సుఖసంతోషాలు లభిస్తాయి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




